స్మృతి, సహాయకుల అలర్ట్: గోవా సీఎం సీరియస్, 3 నెలలుగా కెమెరా!
పనాజీ/బెంగళూరు: గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూంలో దుస్తులు మార్చుకునే గదిలో (చేంజింగ్ రూం)లో స్పై కెమెరా అంశాన్ని గోవా ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రస్తుతం బెంగళూరు బీజేపీ సమావేశాల్లో ఉన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఆయన బెంగళూరు నుండే హామీ ఇచ్చారు.
బెంగళూరు సమావేశాల నుండే పోలీసులను ఆదేశించారు. దుకాణం యజమాని పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, బెంగళూరు పోలీసులు ప్యాబ్ ఇండియా షోరూంను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. థర్మాకోల్ వెనుకాల సీసీ కెమెరా పెట్టినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
షోరూంలో ఉన్న కంప్యూటర్లు, సర్వర్లు, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని పైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు.
గత మూడు నెలలుగా స్పై కెమెరా!
చేంజింగ్ రూంలో గత మూడు నెలలుగా ఈ స్పై కెమెరా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అప్రమత్తంగా ఉండటం వల్లనే ఆమె గుర్తించారని అంటున్నారు. దీనిని స్మృతి సహాయకులు గుర్తించి, ఆమెకు చెప్పినట్లుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
కాగా, స్మృతి ఇరానీ పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలాంగుటే ప్రాంతానికి బోటిక్కు వెళ్లారు. తీరా ఆమె కొన్ని దుస్తులు తీసుకొని ట్రయల్ రూంకి వెళ్లారు. కాసేపటికి ట్రయల్ రూంలో ఉన్న కెమెరాను గుర్తించారు. సరిగ్గా ట్రయల్ రూం లోపలి దృశ్యాలను చిత్రీకరించేలా కెమెరా అమర్చి ఉంది.
నలుగురిని అరెస్టు చేశాం: గోవా సీఎం
గార్మెంట్స్ షోరూంలో స్పై కెమెరా కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు గోవా ముఖ్యమంత్రి పర్సేకర్ చెప్పారు. క్రైం బ్రాంచ్ పోలీసులు దీనిని దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. గోవాలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు ఓ బట్టల దుకాణంలోని చేంజింగ్ రూంలో స్పై కెమెరాను గుర్తించిన విషయం తెలిసిందే. దీనిని గోవా ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
స్మృతి ఇరానీ షాపింగ్ చేసే సమయంలో తన వైపుకు సీసీటీవీ కెమెరా ఫోకస్ చేసి ఉండటాన్ని ఆమె గమనించారని స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ నీలేష్ రానే చెప్పారు. ఈ విషయమై తమకు స్మృతి ఫిర్యాదు చేశారని, దీంతో తాము కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు.
మహిళను అగౌరవపర్చడం: కిరణ్ బేడీ
చేంజింగ్ గదుల్లో స్పై కెమెరాలు పెట్టడం మహిళలను దారుణంగా అవమానపర్చడమేనని కిరణ్ బేడీ అన్నారు.