నేను వారిని తరముకుంటూ వెళ్తున్నా..అభినందన్: 86 సెకెన్లలో నియంత్రణ రేఖ దాటిన వింగ్ కమాండర్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి కొట్టడంలో, నేల కూల్చడంలో మనదేశ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ విషయం భారత వైమానిక దళానికి చెందిన రాడార్ ద్వారా వెల్లడైంది. ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే.. నౌషేరా సెక్టార్ పరిధిలోని లామ్ లోయ సమీపంలో భారత సైనిక శిబిరాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించింది. అవి గతి తప్పాయి. లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి.
దీన్ని గమనించిన వెంటనే నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానంతో శతృవుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదరించారు. ఎఫ్-16 భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా.. అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాప్ట్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపారు. దీనితో అది తిరుగుముఖం పట్టింది. అయినప్పటికీ, అభినందన్ దాన్ని వదల్లేదు. వెంటాడారు. ఈ సందర్భంగా అభినందన్.. ఓ చిన్న సందేశాన్ని పంపించారు. నేను తరుముకుంటూ వారి వెనుకే వెళ్తున్నా.. అని మిగ్ 21లో అమర్చిన రేడియో ద్వారా మాట్లాడారు.
ఉగ్రవాది మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ధృవీకరించిన పాక్ విదేశాంగ మంత్రి: అనుమానాలెన్నో
రాడార్ ఏం చెబుతోంది?
ఎఫ్-16ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 అత్యంత వేగంగా ప్రయాణించినట్లు రాడార్ లో రికార్డయ్యింది. నాలుగు సెకెన్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టమైంది. దీన్ని గంటలతో లెక్కిస్తే 900 కిలోమీటర్ల దూరం అవుతుంది. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో మిగ్-21 ప్రయాణించింది. అంతే వేగంతో 86 సెకెన్ల పాటు మిగ్ ప్రయాణించింది. నియంత్రణ రేఖ దాటి, పాక్ గగనతలంలోకి ప్రవేశించిన క్షణాల వ్యవధిలోనే ఇంజిన్ స్తంభించింది. దీనితో అభినందన్ ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభినందన్ దిగినట్లు వెల్లడైంది. నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ మిగ్ 21 ద్వారా ఆర్ 73 క్షిపణిని ప్రయోగించారు. అది నేరుగా ఎఫ్ 16ను ఛేదించింది. అదే సమయంలో మరో రెండు గస్తీ విమానాలైన సుఖోయ్, మిరేజ్ 2000 మిగిలిన రెండు పాక్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదుర్కొన్నాయని వైమానిక దళ అధికారులు చెబుతున్నారు.