ద్రోహులంతా వెళ్లాల్సిందే: శశికళపై సంచలనం, బెట్టువీడని పన్నీరు
చిన్నమ్మ శశికళపై మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మరోసారి నిప్పులు చెరిగారు. అమ్మ జయలలితకు శశికళ కుటుంబం ద్రోహం చేసిందని మండిపడ్డారు. గతంలో శశికళ కుటుంబాన్ని అమ్మ బయటకు పంపించిందన్నారు. అమ్మ ఆశయాలు నెరవ
చెన్నై: చిన్నమ్మ శశికళపై మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మరోసారి నిప్పులు చెరిగారు. అమ్మ జయలలితకు శశికళ కుటుంబం ద్రోహం చేసిందని మండిపడ్డారు. గతంలో శశికళ కుటుంబాన్ని అమ్మ బయటకు పంపించిందన్నారు. అమ్మ ఆశయాలు నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు.
విద్రోహులంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శశికళ, టివివి దినకరన్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. శశికళ, దినకరన్లను పార్టీ నుంచి తొలగించాల్సిందేనని పన్నీరుసెల్వం డిమాండ్ చేశారు.
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పన్నీరు వర్గం, శశికళ వర్గం (ఇప్పుడు ఇందులో ఎక్కువ మంది నేతలు, మంత్రులు శశికళ, దినకరన్లు వద్దంటున్నారు) సోమవారం అర్ధరాత్రి భేటీ అయింది. ఈ నేపథ్యంలో పన్నీరుసెల్వం తాజాగా మీడియాతో మాట్లాడారు.

జయలలిత మృతిపై విచారణ జరగాలి
అమ్మ మృతిపై న్యాయ విచారణ జరగాలన్నదే తన ప్రధాన, మొదటి డిమాండ్ అని పన్నీరుసెల్వం వ్యాఖ్యానించారు. అమ్మకు శశికళ తీవ్ర ద్రోహం చేశారన్నారు. జయలలితకు జరిగిన వైద్యం వివరాలను అందించాలని చెప్పారు. అమ్మ ఆశయాలు నెరవేరుస్తామని చెప్పారు.

డిమాండ్లు అంగీకరించాల్సిందే
శశికళ వర్గంతో చర్చలకు తాము సిద్ధమని పన్నీరుసెల్వం ప్రకటించారు. అయితే తాము పలు డిమాండ్లు వారి ముందు పెట్టామని, వాటికి అంగీకరించాలని చెప్పారు. అలాగే, జయపై న్యాయ విచారణ చాలా ముఖ్యమని చెప్పారు.

శశికళ నియామకం న్యాయసమ్మతం కాదు
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా శశికళ నియామకం ఏమాత్రం చెల్లదని పన్నీరుసెల్వం తేల్చి చెప్పారు. ఈ పదవి విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పారు. కుటుంబ రాజకీయాలు ఒప్పుకునేది లేదని చెప్పారు. టీవీవీ దినకరన్ పార్టీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.

తలుపులు మూయాల్సిందే
పార్టీ ఎప్పుడు కూడా ఓ ఫ్యామిలీ కింద నడవవద్దని పన్నీరుసెల్వం చెప్పారు. మన్నార్ గుడి ఫ్యామిలికీ డోర్స్ క్లోజ్ చేస్తేనే శశికళ వర్గీయులతో చర్చలు జరుపుతామని కూడా పన్నీరుసెల్వం చెప్పారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై..
శశికళ వర్గంపై కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని పన్నీర్ సెల్వం ఆరోపించారు. దాదాపు రూ. 4వేల కోట్ల వరకు నగదును ఓటర్లకు పంపిణీ చేశారన్నారు. అమ్మ మృతికి ముందు దినకరన్ కనీసం పార్టీ సభ్యుడు కాదని, పార్టీకి జరిగిన ఎన్నికలు చట్ట విరుద్దమన్నారు. ఈసీకి నివేదిక అందించామన్నారు.












Click it and Unblock the Notifications