బ్యాంకులకు వరుస సెలవులు.. ముందు జాగ్రత్తే మేలు
శని, ఆది, సోమవారాల్లో బ్యాంకులు పని చేయవు. వరుస సెలవులు వస్తున్నందున బ్యాంకు వినియోగదారులు తమ పనులను సత్వరమే పూర్తి చేసుకోవాల్సిందిగా ఐబీఏ సూచించింది.
ముంబై: వరుస సెలవులు వస్తున్నందున బ్యాంకు వినియోగదారులు తమ పనులను సత్వరమే పూర్తి చేసుకోవాల్సిందిగా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరింది. శని, ఆది, సోమవారాల్లో బ్యాంకులు పని చేయవు.
కాబట్టి ముఖ్యమైన లావాదేవీలు, ఇతరత్రా బ్యాంకు సంబంధిత పనులను శుక్రవారమే పూర్తి చేసుకోవాలని సూచించింది. 11న సెకండ్ శాటర్ డే, 12న ఆదివారం, 13న హోలీ పండుగ సెలవులు ఉన్నందున వినియోగదారులు జాగ్రత్త పడటమే మేలు.
ఇప్పటికే ఏటీఏంలలో డబ్బు నిల్వలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. డబ్బు డ్రా చేసుకునేందుకు ఏ ఏటీఏంకు వెళ్లినా అక్కడ 'నో క్యాష్' అన్న బోర్డు వెక్కిరిస్తూ కనిపిస్తోంది.
కొన్ని బ్యాంకు శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉండడంపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పులి మీద పుట్రలా.. ఇప్పుడీ వరుస సెలవులు వస్తుండడంతో మళ్లీ డబ్బుల కోసం శుక్రవారమే ఏటీఎంల వద్ద ప్రజలు బారులుతీరి కనిపిస్తున్నారు.