అఫ్జల్గురుకు దండం పెడ్తారా: వెంకయ్య ఘాటు ప్రశ్న
న్యూఢిల్లీ: వందేమాతరం ఆలపించడంపై చెలరేగిన వివాదంపై భారత ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. తల్లికి కాకపోతే ఉగ్రవాది అయిన అప్జల్గురూకు దండం పెడతారా అని ప్రశ్నించారు.
వందేమాతరం ఆలపించబోమని, జాతీయగీతమైన జనగణమననే పాడుతామని కొన్ని రాజకీయ పక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీహెచ్పీ నిర్వహించిన ఓ పుస్తక విడుదల కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు.
వందేమాతరం పాడడమంటే మాతృభూమికి దండం పెట్టడమేనని చెప్పారు. మాతృభూమికి దండం పెట్టడంలో వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థులు వందేమాతరం ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
'భారత్ మాతాకీ జై' అనేది దేవున్ని పూజించడం కాదని ఆయన అన్నారు. దేశంలో నివసిస్తున్న 125 కోట్ల మంది మతం, కులాలతో సంబంధం లేకుండా తామంత భారతీయులమనే భావనతో నివసిస్తున్నారని స్పష్టం చేశారు.
'హైందవం అంటే గొప్ప ధర్మం. అది ఒక సంప్రదాయం. అదే భారతీయత. దీనిని మనం వారసత్వంగా పొందాం. హిందుత్వం అంటే ఓ జీవన విధానం' అని ఆయన వివరించారు. ప్రపంచం వసుధైక కుటుంబ భావనతో ప్రపంచమంతా ఒకే కుటుంబమని బోధిస్తుందని ఆయన చెప్పారు.