పాకిస్థాన్ అలావుంటే.. ఐఎంఎఫ్ కంటే మించిన సాయం: రాజ్నాథ్ సంచలనం
శ్రీనగర్: పాకిస్థాన్.. భారత్తో స్నేహంగా ఉండివుంటే ఆ దేశాన్ని తామే ఆదుకునేవారమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురేజ్ నియోజకవర్గంలో బీజేపీ తరపున ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఒకవేళ పాకిస్థాన్.. భారత్తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే.. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) నుంచి ఇస్లామాబాద్ కోరిన దానికంటే పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేవాళ్లమని రాజ్నాథ్ తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దుపై అక్కసుతో జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు పాక్ యత్నిస్తోందని, ఇక్కడ ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవడం ఆ దేశానికి ఇష్టం లేదన్నారు. 2014-15లో జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అది ఇప్పుడు రూ. 90 వేల కోట్లకు చేరుకుందన్నారు. ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్ కోరిన బెయిల్అవుట్ ప్యాకేజీ కంటే ఇది చాలా పెద్దదని తెలిపారు.

ఒక వేళ పాకిస్థాన్.. భారత్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించివుంటే ఐఎంఎఫ్ కంటే ఎక్కువే సాయం (డబ్బులు) చేసేవాళ్లమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పొరుగు దేశం చాలా కాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని, తన భూభాగంపై ఉగ్ర కార్యకలాపాల నిర్వహణకు ఇతర దేశాల నుంచి డబ్బు అడుగుతోందని ఆరోపించారు.
భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు దాని మిత్రదేశాలు కూడా వదిలేయడంతో అంతర్జాతీయ వేదికలపై ఒంటరిగా మారిందన్నారు రాజ్నాథ్ సింగ్. పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచే టర్కీ ఇటీవల యూఎన్జీఏలో కాశ్మీర్ గురించి ప్రస్తావించలేదన్నారు. భారత్ పై ఎవరైనా దాడికి పాల్పడితే వాళ్ల భూభాగంపైనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందేందుకు పాకిస్థాన్.. ఏకంగా తన దేశంలోని 1.50 లక్షల ఉద్యోగులను తొలగించింది. అంతేగాక, ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేసింది.












Click it and Unblock the Notifications