నిజంగా మీరు అవినీతి పరుడైతే బహిరంగ చర్చకు రండి..! మోదీకి రాహుల్ సవాల్..!!
దిల్లీ/హైదరాబాద్ : 2019ఎన్నికల్లో మాటల యుద్దానికి తెరపడి ట్వీట్ల యుద్దానికి తెరలేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రచారానికి సమయం దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోదీ, బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రధానిజీ.. అవినీతిపై నాతో చర్చకు భయపడుతున్నారా? మీ కోసం చర్చను మరింత సులభతరం చేస్తున్నాను. దీంతో మీరు సన్నద్ధమవడానికి వీలుగా ఉంటుంది అని రాహుల్ వ్యాఖ్యానించారు. అలాగే చర్చించాల్సిన మూడు అంశాలను కూడా ఆయన పేర్కొన్నారు. రఫేల్+అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, అమిత్ షా+నోట్ల రద్దు అంశాలపై చర్చకు రావాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా దేశ భద్రత, అవినీతి, విదేశాంగ విధానంపై చర్చకు రావాలని రాహుల్.. ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో తనతో చర్చకు భయపడుతున్నారా అంటూ స్కేర్డ్ టు డిబేట్ హ్యాష్ ట్యాగ్తో మంగళవారం మరోసారి ట్వీట్ చేశారు. రఫేల్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా మోదీ వ్యవహరించారనీ రాహుల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన రాహుల్ అది ఒక ఏకాకి గళం గా అభివర్ణించారు.