భారత్ బొగ్గు సంక్షోభం- విద్యుత్ ప్లాంట్లకు కేంద్రం వెసులుబాట్లు-కొత్త మార్గదర్శకాలు
దేశాన్ని బొగ్గు సంక్షోభం కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.వీటికి తోడు ఇతరత్రా కారణాలతో కూడా ప్లాంట్లు మూతపడుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మార్గదర్శకాలకు సవరణలు చేయడంతో పాటు కొత్తగా వెసులుబాట్లు కూడా ప్రకటిస్తోంది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విద్యుత్ ప్లాంట్లకు ఉత్పత్తి విషయంలో ఊరట లభించబోతోంది
Recommended Video

బొగ్గు సంక్షోభంతో రాష్ట్రాల విలవిల
దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. పలు రాష్టాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. బొగ్గు సంక్షోభం కారణంగా యూపీలో 8 విద్యుత్ ప్లాంట్లు నిలిచిపోయాయి, ఇతరత్రా కారణాలతో 6 ప్లాంట్లు మూతపడటంతో యూపీలో మొత్తం మూతపడిన విద్యుత్ ప్లాంట్ల సంఖ్య14కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ సైతం త్వరలో విద్యుత్ సంక్షోభం ముందు ఉందని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పలు దక్షిణాది రాష్ట్రాల్లో సైతం విద్యుత్ ప్లాంట్లు మూతపడే పరిస్ధితికి చేరుకుంటున్నాయి.

బొగ్గు సంక్షోభంపై కేంద్రం సమీక్ష
బొగ్గు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే బొగ్గు సంక్షోభంపై అంతర్ మంత్రిత్వ ఉపసంఘం వారానికి రెండు సార్లు బొగ్గు నిల్వల్ని సమీక్షిస్తోంది. అలాగే రోజువారీ బొగ్గు నిల్వల సమీక్షల కోసం ఆగస్టు 27న వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో కోర్ మేనేజ్ మెంట్ టీమ్ ను సైతం ఏర్పాటు చేసింది. ఈ టీమ్ కోల్ ఇండియా లిమిటెడ్, రైల్వేలతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు సరఫరాను పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 7 నాటికి బొగ్గు ఉత్పత్తి 1.501 మిలియన్ టన్నులకు చేరిందని కోర్ మేనేజ్ మెంట్ కమిటీ తాజా సమీక్షలో నిర్ధారించింది. దీన్ని రాబోయే మూడు రోజుల్లో గరిష్టంగా 1.7 మిలిటన్ టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో వాస్తవ సరఫరాకూ, వినియోగానికీ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

బొగ్గు సంక్షోభానికి కారణాలివే
బొగ్గు సంక్షోభానికి కోర్ మేనేజ్ మెంట్ కమిటీ గుర్తించిన కారణాలు ఇలా ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్ధ తిరిగి గాడిన పడటం,
సెప్టెంబర్లో కోల్ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటం, గనుల నుంచి బొగ్గు రాకపోవడం, సరఫరాలో ఇబ్బందులు
విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధర పెరగడం, తద్వారా అక్కడి దిగుమతి చేసుకున్న విద్యుత్ ప్లాంట్లలో
ఉత్పత్తిలో ఇబ్బందులు తలెత్తడం వంటి కారణాలు ప్రధానంగా బొగ్గు సంక్షోభానికి దారి తీస్తున్నాయి. వర్షాకాలానికి ముందే తగినన్ని బొగ్గు నిల్వలు సిద్దంగా ఉంచుకోకపోవడం, మహారాష్ట్ర, రాజస్దాన్, యూపీ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు బొగ్గు సంస్ధలకు భారీగా బకాయిలు పడటం, కోవిడ్ తర్వాత ఆర్ధిక వ్యవస్ధ పునరుద్ధరణ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరగడం
రోజువారీ విద్యుత్ డిమాండ్ 4 బిలియన్ యూనిట్లకు చేరడం, ఇందులో 65 శాతం నుంచి 70 శాతం విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతుండటం వంటి కారణాలు కూడా సంక్షోభాన్ని పెంచుతున్నాయి.

విదేశీ విద్యుత్ ప్లాంట్లకు కేంద్రం మార్గదర్శకాలు
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భాగమై ఉన్న విదేశీ ప్లాంట్లు, పూర్తిస్ధాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయని పలు సంస్ధలు
గ్రిడ్ అవసరాల దృష్ట్యా కావాల్సిన విద్యుత్ ను అందించాలని కేంద్రం కోరుతోంది. 2016 టారిఫ్ పాలసీ ప్రకారం సాధ్యమైనన్ని విద్యుత్ స్టేషన్లు అందుబాటులో ఉండాలని, అవి అవసరాల మేరకు విద్యుత్ సరఫరా చేయాలని నిబంధనలు ఎలాగో ఉన్నాయి. దీంతో కేంద్రం విదేశీ విద్యుత్ ప్లాంట్లకు ఊరటనిచ్చేలా కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. కేంద్రం పాలసీ ప్రకారం విద్యుత్ ప్లాంట్లు తమ విద్యుత్ ను కేంద్రం కోరినట్లుగా సరఫరా చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్ధలు లేదా ప్లాంట్లు కేంద్రం నుంచి 24 గంటల ముందు విద్యుత్ కోసం ఎలాంటి అభ్యర్ధనా రాకపోతే దాన్ని స్వేచ్ఛగా పవర్ ఎక్స్ఛేంజ్ లో అమ్ముకునే వీలుంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి సంస్ధలు తాము కొనుగోలు ఒప్పందం చేసుకున్న వారికి 24 గంటల తర్వాత కూడా సరఫరా చేయాల్సిన అవసరం లేనప్పుడు దాన్ని పవర్ ఎక్ఛేంజ్ లో అమ్ముకునే వీలుంది. విద్యుత్ ఉత్పత్తిదారు, కొనుగోలు దారు (ప్రభుత్వం) ఉత్పత్తి అయిన విద్యుత్ లాభాల్ని 50-50 నిష్పత్తిలో పంచుకోవచ్చు. అయితే దీన్ని కేంద్రం మాత్రం విద్యుత్ అమ్మకపు ధర, విద్యుత్ ఛార్జీ రేటుకు మధ్య వ్యత్యాసంగా మాత్రమే పరిగణిస్తుంది.విద్యుత్ సంస్ధలు కొనుగోలు ఒప్పందాల్లో ఉన్న నిర్ణీత ధరలకే పవర్ ఎక్సేంజ్ లో అమ్ముకునే వీలుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారమే విద్యుత్ సంస్ధలు తమ ఛార్జీలు, బాధ్యతలు కలిగి ఉంటారు.












Click it and Unblock the Notifications