యూపీలో ముగిసిన ప్రచారం - వారణాసిలో ప్రధాని సభ : 7న తుది విడత పోలింగ్..!!
దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు తుది దశకు చేరాయి. ఏడు విడతల పోలింగ్ లో భాగంగా..చివరి విడత పోలింగ్ ఈ నెల 7వ తేదీన జరగనుంది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం ముగిసింది. తొమ్మిది జిల్లాల్లోని 54 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 613 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మావు, ఆజాంఘర్, జాన్ పూర్, వారణాశి, చందోలి, మీర్జాపూర్, సోన్బద్రా, బాదోహి జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచార సమయం ముగియటంతో బయట వ్యక్తులు వెళ్లిపోవాలని పోలీసు అధికారులు స్పష్టం చేసారు.
చివరి రోజు ప్రచారంలో ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని మోదీ అన్నారు. ఖజూరీ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. యూపీ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలని ప్రజలే పోరాడుతున్నారని చెప్పారు. విపక్షాలను రాజవంశాలుగా అభివర్ణించిన ఆయన.. తనపై ఉన్న కోపంతో వోకల్ ఫర్ లోకల్, స్వచ్ఛభారత్ అభియాన్ వంటి కార్యక్రమాలను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు.
ఉక్రెయిన్ సమస్యపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు విడతల పోలింగ్ ప్రశాంతంగ ముగిసింది. ఇక, చివరి విడతలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా, 7వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాత వెలువడ నున్న ఎగ్జిట్ పోల్ ఫలితాల పైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే, యూపీలో మాత్రం ప్రధానంగా బీజేపీ వర్సెస్ ఎస్పీ అన్నట్లుగా పోరు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.