వాయనాడ్ ఎఫెక్ట్ : రాహుల్కు మరో ముగ్గురు గాంధీల సెగ..!
వాయనాడ్ : గాంధీ కుటుంబ వారసుడు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు ఎన్నికల వేళ ఎన్ని కష్టాలో. అమేథి నుంచి ఒకవైపు.. వాయనాడ్ నుంచి మరోవైపు లోక్ సభ బరిలో నిలిచినా.. కష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. వాయనాడ్ స్థానంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మైనార్టీలతో పాటు కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లు కలిసి వస్తాయనేది ఆయన ధీమా. అయితే వాయనాడ్ లో రాహుల్ కు మరో ముగ్గురు గాంధీల సెగ తగలడం చర్చానీయాంశంగా మారింది.

అందరూ గాంధీలే..!
వాయనాడ్ పార్లమెంటరీ స్థానంలో నలుగురు గాంధీలు పోటీపడ్డారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకరు కాగా, రఘుల్ గాంధీ, రాహుల్ గాంధీ కేఈ, కేఎం శివప్రసాద్ గాంధీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ హస్తం గుర్తుపై, రఘుల్ గాంధీ బకెట్ గుర్తుపై, రాహుల్ గాంధీ కేఈ ఇసుక గడియారంపై, కేఎం శివప్రసాద్ గాంధీ ఎయిర్ కండిషనర్ గుర్తుపై పోటీచేశారు. రాహుల్ గాంధీ తర్వాత అంతో ఇంతో పేరుందంటే రఘుల్ గాంధీకే ఉంది. మిగతా ఇద్దరు అంత పెద్దగా ఫేమస్ కాదు. రఘుల్ గాంధీ హిందుస్థాన్ జనతా పార్టీ సపోర్టుతో అఖిల ఇండియా మక్కన్ కళగం పార్టీ తరపున బరిలో నిలిచారు.

రఘుల్ గాంధీకి కాంగ్రెస్ నేపథ్యం
రఘుల్ గాంధీ తండ్రి, తాత ఇద్దరూ కూడా కాంగ్రెస్ మద్దతుదారులే. రఘుల్ గాంధీ తండ్రి కృష్ణన్ దాదాపు 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి ప్రచార సేవలు అందించారట. అలాగే ఆయన తాత పళని స్వామి స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మద్దతుదారుడు. జాతిపిత మహాత్మాగాంధీపై ఉన్న గౌరవంతో రఘుల్ గాంధీ తండ్రి ఆయనకు ఈ పేరు పెట్టారట. ఈయన సోదరి పేరు ఇందిరా ప్రియదర్శిణి కావడం కొసమెరుపు.
రఘుల్ గాంధీ రాజకీయాలకు కొత్త కాదు. 2014లో కోయంబత్తూరు నుంచి మేయర్గా, 2016లో తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తమ కుటుంబం కాంగ్రెస్ మద్దతుదారులైనప్పటికీ.. తన డిమాండ్లకు ప్రాచుర్యం కల్పించడానికే రాహుల్ గాంధీపై పోటీకి సై అన్నారట. 33 రాష్ట్ర భాషలకు అధికార హోదా కల్పించాలనేది ఆయన పోరాటం. ప్రధానంగా ద్రావిడ భాషలకు జాతీయ హోదా కల్పించడం మొదటి నినాదమైతే.. అన్ని పన్నుల నుంచి దేశపౌరులకు విముక్తి కల్పించడం ఆయన రెండో డిమాండ్.

పోరులో నలుగురు గాంధీలు
ఇక రాహుల్ గాంధీ కేఈ సామాజిక కార్యకర్త. ఈయన కొట్టాయం జిల్లాకు చెందినవారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వాయనాడ్ బరిలో నిలిచారు. అదలావుంటే కేఎం శివప్రసాద్ గాంధీ రీసెర్చ్ స్కాలర్. ఈయన త్రిసూర్ జిల్లాకు చెందినవారు. గాంధీయన్ పార్టీలో క్రీయాశీలకంగా కొనసాగుతున్నారు. అయితే శివప్రసాద్ ఈ పార్టీలో చేరాకే తన పేరు చివరన గాంధీ అని పెట్టుకున్నారట. ఎన్నికల్లో వీరిద్దరి ప్రభావం అంతగా లేకున్నా.. రఘుల్ గాంధీ మాత్రం కొంతమేర ఎఫెక్ట్ చూపుతారనే టాక్ వినిపిస్తోంది.

పేర్లు ఒకేలా ఉన్నా.. గందరగోళం లేదంట..!
ఒకే పేరుతో అభ్యర్థులుంటే ఓటర్లకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. గతంలో బ్యాలెట్ విధానంలో అభ్యర్థుల ఫోటోలు లేకపోవడం.. పేర్లు, గుర్తులు మాత్రమే ఉండటంతో సహజంగానే ఓటర్లు గందరగోళానికి గురయ్యేవారు. కానీ ఈవీఎంలు వచ్చాక, అభ్యర్థుల ఫోటోలు కూడా పెడుతుండటంతో అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉన్నా ఇబ్బందులు ఉండబోవు. తమకు నచ్చిన అభ్యర్థి పేరు, గుర్తు చూసుకుని.. అవసరమైతే ఫోటో చూసిన తర్వాత ఓటేసే అవకాశముంది. దీంతో ఒకే పేరుతో చాలామంది బరిలో నిలిచినా పెద్దగా నష్టమేమీ ఉండదు.
వాయనాడ్ స్థానంలో మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడోదశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మంగళవారం (23.04.2019) నాడు పోలింగ్ జరిగింది. అయితే నలుగురు గాంధీల పేర్లు చూసి ఓటర్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారే తప్ప గందరగోళం చెందిన దాఖలాలు లేవు.












Click it and Unblock the Notifications