29 సంస్థలు.. రూ.448 కోట్లు... పన్నుఎగవేత సంస్థలపై ఐటీ కన్నెర్ర
ఆదాయపు పన్ను శాఖ ‘నేమింగ్ అండ్ షేమింగ్’ విధానం కింద ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారుల వివరాలను శనివారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతలకు సంబంధించిన జాబితాను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. 'నేమింగ్ అండ్ షేమింగ్' విధానం కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను శనివారం ప్రకటించింది. రూ.448.02 కోట్లు బకాయి పడిన 29 సంస్థల పేర్లను బహిర్గతం చేసింది.
పదే పదే హెచ్చరించినా, అవకాశాలు ఇచ్చినా బకాయిలు చెల్లించని వారి జాబితాను ప్రముఖ జాతీయ దినపత్రికలకు ఐటీ శాఖ విడుదల చేసింది. ఆదాయం పన్ను మరియు కార్పొరేట్ పన్ను చెల్లించని వారి జాబితా ప్రకటనను జారీ చేసింది. పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాల్సిందిగా కోరింది.
వ్యకిగత లేదా సంస్థల పేర్లు, పాన్ కార్డు, ఆఖరి చిరునామా, అంచనా పరిధి, బకాయి పడిన పన్ను వివరాలను ప్రకటించినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించిన అసెస్సీలు ఎక్కడ ఉన్నా.. తక్షణం పన్ను బకాయిలను చెల్లించాలని కోరారు.
అలాగే ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచారం ప్రకారం.. ఎగవేతదారుల గురించి తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. అటు సీబీడీటీ వెబ్ సైట్ లో కూడా డీఫాల్టర్ల జాబితాను పోస్ట్ చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు(సీబీడీటీ) దీర్ఘకాలిక రుణాలు చెల్లించని వారి పేర్లను బహిర్గతం చేసే వ్యూహాన్ని ఆరంభించింది. ఈ జాబితాను దాని అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేయడం కూడా ప్రారంభించింది.