అవగాహన లేదా సమతౌల్యం: భారత్, చైనా ఏదో ఒక దశకు చేరాల్సిందే: విదేశాంగ మంత్రి జైశంకర్
పక్కపక్కనే ఉంటూ, ఒకే సమయంలో ఆర్థిక శక్తులుగా ఎదుగుతూ, పరస్పరం ప్రభావం చూపుకుంటోన్న భారత్, చైనాలు కలకాలం పోట్లాడుకుంటూ ఉడలేవని, అయితే అవగాహనకో లేదంటే సమతౌల్య స్థితికో తప్పక చేరాల్సిందేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఇంతకుముందు లేని కొత్త ప్రాంతాలపై అధికారం చెలాయిస్తానని చైనా అంటే, భారత్ చూస్తూ కూర్చోబోదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
Recommended Video
చైనా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత్, చైనా బలగాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మంత్రి జైశంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాజాగా తాను రాసిన ''The India Way: Strategies For An Uncertain World'' పుస్తకాన్ని సభికులకు పరిచయం చేసిన మంత్రి జైశంకర్.. చైనా, భారత్ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
''ప్రపంచంలోని అన్ని దేశాలు చేస్తున్నట్లే.. చైనా పెరుగుదలపై భారత్ కూడా ఓ కన్నేసి ఉంచింది. అదీగాక చైనా మాకు పొరుగుదేశం కాబట్టి ప్రత్యక్షంగానూ భారత్ పై ప్రభావం ఉంటుంది. అయితే, చైనాతోపాటు భారత్ కూడా అన్ని రకాలుగా ఎదుగుతోందన్నది వాస్తవం. బహుశా చైనా స్థాయిలో కాకపోయినా, భారత్ తన స్థాయిలోనే అదే వేగంతో దూసుకెళుతోంది. గడిచిన 30 ఏళ్ళుగా ఇండియా వృద్ధి అనేది ప్రపంచ టాపిక్ గానూ ఉందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. బిలియన్ పైచిలుకు జనాభా ఉన్న రెండు పెద్ద దేశాలుగా, తమకంటూ ప్రత్యేక చరిత్ర, సంస్కృతి కలిగినవిగా భారత్, చైనాలు కచ్చితంగా స్నేహభావం లేదంటే సమతౌల్య దశకు చేరుకోవడం చాలా ముఖ్యం'' అని మంత్రి జైశంకర్ అన్నారు.
ప్రాక్టికల్ ప్రపంచంలో ఏ దేశమూ మరో దేశం దూకుడును సహించే స్థితిలో లేవని, కొత్త ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాం, అక్కడ అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే పరిస్థితి ఉండబోదని, ఒక వేళ చైనా ఆ దిశగా అడుగులు వేస్తే, భారత్ సైతం అంతే స్థాయిలో దీటుగా బదులిస్తుందని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. భారత్ తన పంథాలో ప్రపంచానికి ఎలా దారి చూపిందనే అంశాలను తన పుస్తకంలో విపులంగా రాశానని ఆయన తెలిపారు.