మన కాలపు మహాద్భుత ఘట్టం: శతాబ్దాల నాటి కల సాకారం: ముందే వచ్చిన దీపావళి
అయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు.
Recommended Video
ముందే వచ్చిన దీపావళి..
రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్యను దీపకాంతులను అలంకరించారు. సరికొత్త శోభను సంతరించుకుంది. దీపావళి పండుగ వాతావరణం నెలకొంది. సరయూ నదీ తీరం మొత్తాన్ని మూడు రోజులుగా దీపాల వరుసతో నింపేస్తున్నారు. వేర్వేరు రంగులతో సరయూ తీరం మెరిసిపోతోంది. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతోంది. రామమందిరం నిర్మాణాన్ని మన కాలపు మహాద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. శ్రీరామచంద్రుడు జన్మించిన ఈ ప్రదేశం ఆధ్మాత్యిక వాతావరణంలో మునిగిపోయింది.
ప్రధాని చేతుల మీదుగా తొలి ఇటు..
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి భవ్య ఆలయ నిర్మాణానికి ఈ మధ్యాహ్నం తొలి ఇటుక పడబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి కాబోతోంది. శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించబోయే భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. 12.40 నిమిషాలకు రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపనచేస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన తొలి ఇటుకతో రామమందిరం నిర్మాణానికి శిలాన్యాస్ చేస్తారు. దీనికోసం వెండి ఇటుకలను వినియోగించనున్నారు.
తిరుమల సహా..
పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి పుష్కరిణి నుంచి సేకరించిన జలాలు, మట్టి సహా గంగ, ఇతర నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు, మట్టిని భూమిపూజ కోసం వినియోగిస్తారు. శిలాన్యాస్ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. దేవతా పుష్పంగా పేరున్న పారిజాతం మొక్కను నాటుతారు. శ్రీరామజన్మభూమి మందిర్ పేరిట రూపొందించిన పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. అనంతరం నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొంటారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధాని
అయోధ్య రామాలయం భూమిపూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. ఉత్తర్ప్రదేశ్లో రాజధాని లక్నోకు చేరుకుంటారు. అక్కడి నుంచి అయోధ్యకు చేరుకుంటారు. 11.30 గంటలకు హనుమాన్ గచ్చి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటల నుంచి 12.45గంటల మధ్య భూమిపూజ కొనసాగుతుంది.