కేంద్రంలో లెక్కలన్నీ తారుమారు - ఎన్డీయేతో పోటాపోటీగా ఇండియా కూటమి-యూపీలో లీడ్..!
ఈసారి దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇవాళ జరుగుతున్న ఓట్ల లెక్కింపులో పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికి విపక్ష ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ యూపీ వంటి రాష్ట్రాల్లో సైతం ఇండియా కూటమి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. దీంతో కేంద్రంలో ఈసారి లెక్కలు మారినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీయూతో పాటు పలు ఎన్డీయే కూటమి పార్టీలు కీలకంగా మారే అవకాశముంది.

ఈసారి లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి ఆధిక్యం కొనసాగుతున్నప్పటికీ ఇండియా కూటమి దూకుడును విస్మరించలేని పరిస్ధితి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ 200కు పైగా సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యం కొనసాగిస్తోంది. ఎన్డీయే కూటమి అధికారానికి అవసరమైన 272 సీట్ల మ్యాజిక్ మార్క్ ను దాటింది. అయితే బీజేపీ మాత్రం ఒంటరిగా మెజార్టీ సాధించే అవకాశం లేదని తేలిపోతోంది. మిత్రపక్షాల సాయంతో మాత్రమే బీజేపీ అధికారం చేజిక్కించుకోనుంది.
మరోవైపు బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. యూపీలో మొత్తం 80 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 41 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. తద్వారా యూపీలో బీజేపీ ఆధిపత్యానికి గండి పడినట్లే భావిస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఎస్పీ అభ్యర్ధులు కూడా ముందంజలో ఉన్నారు. అమేథీలో సైతం బీజేపీ నేత స్మృతీ ఇరానీ వెనుకంజలో ఉన్నారు.
మహారాష్ట్రలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమి 24 సీట్లలో లీడ్ లో ఉంటే, ఇండియా కూటమి 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్ లో మాత్రం మొత్తం 29 సీట్లలో బీజేపీ లీడ్ లో ఉంది. ఒడిశాలో సైతం బీజేపీ లీడ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ చూస్తుంటే కేంద్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఈసారి కింగ్ మేకర్ గా మారబోతున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications