India-China standoff: 12 సుఖోయ్, 21 మిగ్ 29 కొనుగోలుకు ఐఏఎఫ్ ప్రణాళిక
న్యూఢిల్లీ: భారత సైనికులపై చైనా దళాలు ఘర్షణలకు దిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. యుద్ధ రంగంలో సత్తా చాటే సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని నరేంద్ర మోడీ సర్కారుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ నుంచి ప్రతిపాదన వచ్చింది.
12 సుఖోయ్, 21 మిగ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతివ్వాలని కోరింది. రూ. 5 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు వచ్చేవారంలో కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకోనుంది. రష్యా నుంచి అదనపు మిగ్-29 యుద్ధ విమానాలను తీసుకోవాలని, ఉన్నవాటిని అప్గ్రేడ్ చేయాలని తెలిపింది వాయుసేన.

36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లోనే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 58వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది మే నెలలోనే తొలి రఫేల్ విమానం మనదేశానికి రావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే సుఖోయ్ 30, మిగ్ విమానాలను సైన్యంలో చేర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో సుఖోయ్ 30లతోపాటు మిరాజ్ 2000, మిగ్ 29లు ఉన్నాయి. జాగ్వర్స్, మిగ్ 21 బిసన్స్ ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైన్యంలో మరింత శక్తివంతమైన ఆయుధాలు ఉండాలని త్రివిధ దళాలు భావిస్తున్నాయి.
గల్వాన్ లోయ వద్ద చైనా దళాలు జరిపిన దాడుల్లో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. భారత దళాలు కూడా చైనా సైనికుల దాడులను ధీటుగా తిప్పికొట్టాయి. భారత దళాల ప్రతిదాడుల్లో సుమారు 40మందికిపైగా చైనా సైనికులు హతమైనట్లు సమాచారం. అయితే, చైనా మాత్రం తమ వైపు ఎంత మంది సైనికులు చనిపోయారనే విషయంపై అధికారికంగా వెల్లడించడం లేదు.












Click it and Unblock the Notifications