చైనా - ఇండియా మధ్య యుద్ధ మేఘాలు.. చైనాపై సైనిక చర్యకు సిద్ధం అంటున్న ఇండియన్ ఆర్మీ చీఫ్
భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గకుండా అతిక్రమణలకు పాల్పడటంతో ఇండియా , చైనాల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతుంది. తూర్పు లద్దాఖ్ లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ ఆ చర్చలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో సైనిక చర్యకు అయినా సిద్ధం అంటుంది ఇండియన్ ఆర్మీ .
Recommended Video

చర్చలు విఫలం అయితే సైనిక చర్యతో చైనాకు సమాధానం
లద్దాఖ్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేసిన అతిక్రమణలను పరిష్కరించడానికి సైనిక చర్యకు భారతదేశం సిద్ధంగా ఉందని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు సైన్యాల మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలమైతే యుద్ధానికి అయినా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంతవరకు శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి, చొరబాట్లు నివారించడానికి వీలైన విధానాన్ని అనుసరిస్తున్నామని, అందుకే చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

వాస్తవాధీన రేఖ వద్ద సమస్య పరిష్కారానికి చర్చలతో ప్రయత్నిస్తున్న ఇండియా
వాస్తవాధీన రేఖ వెంట యధాతథ స్థితిని పునరుద్ధరించే అన్ని ప్రయత్నాలు విజయవంతం కాకపోతే అప్పుడు ఖచ్చితంగా సైనిక చర్యను ఎంచుకుంటామని బిపిన్ రావత్ పేర్కొన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లద్దాఖ్ లోని అతిక్రమణల సమస్యలను పరిష్కరించడానికి, యధాతథ స్థితిని పునరుద్ధరించటానికి గల అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని, దౌత్య చర్చలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం - చైనా మధ్య నెలకొన్న ఘర్షణపై గత రెండున్నర నెలల కాలంలో అనేక పర్యాయాలు సైనిక మరియు దౌత్య చర్చలు జరిగాయని తెలుస్తుంది.

పాంగాంగ్ త్సో సరస్సు వద్ద ఫింగర్స్ విషయంలో వివాదం
ప్రస్తుతం మరోమారు జరుగుతున్న చర్చలు కూడా మంచి ఫలితాలను ఇవ్వడం లేదని సైనిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్స్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య బలగాల ఉపసంహరణ పై చిక్కుముడి ఏర్పడింది. ఫింగర్ 8 నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని భారత్ చెబుతుంటే , ఫింగర్ 2 నుండి వాస్తవాధీన రేఖ వెళుతుందని చైనా వాదిస్తోంది. ఈ విషయంలో ఇరు దేశాలు పట్టుదలతో ఉన్నాయి .

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారే అవకాశం లేనట్టే పరిస్థితి
తూర్పు లద్దాఖ్ లోని సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారానికి చైనా సానుకూలంగా లేదని, భారత సైన్యం యొక్క బలమైన ప్రతిస్పందన కారణంగా ఊహించని పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వేలికేస్తే కాలికేస్తూ , కాలికేస్తే వేలికేస్తూ చైనా భారత్ తో కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది.
మరోవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారే అవకాశాలు లేకపోవడంతో ఎలాంటి పరిస్థితి కైనా సిద్ధంగా ఉండాలని సైనికాధికారులు భారత సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

శీతాకాలంలోనూ అక్కడే ఉండి చైనాతో పోరాటం ... ఏర్పాట్లు చేసుకుంటున్న ఇండియన్ ఆర్మీ
రానున్న శీతాకాలంలో కూడా అక్కడే కొనసాగేలా భారత సైన్యం ఏర్పాటు చేసుకుంటోంది. అందుకు తగ్గట్టుగా సాధనాలు , ఆయుధాలను సమకూర్చుకుంటుంది. వైమానిక దళాన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని భారత ఆర్మీ స్పష్టం చేస్తుంది . చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారావనే ఇప్పటికే ఎల్ఐసి వెంట ఫ్రంట్లైన్ నిర్మాణాల పర్యవేక్షణను ఆర్మీ యొక్క సీనియర్ కమాండర్లందరికీ తెలియజేశారు. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న కొన్ని ఎత్తైన ప్రదేశాలలో ఉష్ణోగ్రత శీతాకాలంలో మైనస్ 25 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. అయినప్పటికీ భారత సైన్యం మాత్రం చైనా కు దీటుగా సమాధానం చెప్పడానికి అక్కడే కొనసాగేలా సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications