కరోనా ఉగ్రరూపం: తాజాగా లక్షన్నర కేసులకు చేరువగా.. కొత్తకేసుల నమోదులో ఇండియాలో టాప్ 5 రాష్ట్రాలివే
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు దేశాన్ని మళ్లీ ఆరోగ్య సంక్షోభంలో పడేస్తున్నాయి. థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 1,41,986 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. లక్షన్నరకు చేరిన కరోనా కేసులతో భారతదేశంలో కరోనా కోరలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిన్నటి కంటే 21.3 శాతం ఎక్కువ అని సమాచారం. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,68,372గా ఉంది.
Recommended Video
కరోనా రోజువారీ కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలివే
అత్యధికంగా మహారాష్ట్రలో 40,925 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. గత కరోనా సెకండ్ వేవ్ లో కూడా మహారాష్ట్ర దారుణ పరిస్థితులను చూసింది. కరోనా మహమ్మారి రోజువారి కేసుల నమోదులో మహారాష్ట్ర అత్యధిక కేసులు నమోదు చేసి మొదటి స్థానంలో ఉండగా 18,213 కేసులతో పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో ఉంది.
17,335 కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలోనూ, 8,981 కేసులతో తమిళనాడు నాలుగవ స్థానంలోనూ, 8,449 కేసులతో కర్ణాటక ఐదవ స్థానంలోనూ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి నమోదైన కేసులే కొత్త కోవిడ్-19 కేసుల్లో 66.14 శాతంగా ఉన్నాయి. కొత్త కోవిడ్-19 కేసుల్లో మహారాష్ట్ర మాత్రమే 28.82 శాతం కరోనా కేసుల నమోదుకు కారణంగా మారింది.
గత 24 గంటల్లో 285 కరోనా మరణాలు
గత 24 గంటల్లో, దేశంలో 285 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం నివేదించబడిన మరణాల సంఖ్య 4,83,463 కు పెరిగింది. కేరళలో అత్యధిక మరణాలు 189 మరణాలు సంభవించాయి,. మహారాష్ట్రలో 20 రోజువారీ మరణాలు నమోదయ్యాయి.
భారతదేశం యొక్క రికవరీ రేటు ఇప్పుడు 97.3 శాతంగా ఉంది. ఇంతకుముందు రికవరీ రేటుతో పోలిస్తే కాస్త రికవరీ రేటు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది.గత 24 గంటల్లో కోవిడ్-19తో బాధపడుతున్న మొత్తం 40,895 మంది రోగులు కోలుకున్నారు. దీనితో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,44,12,740కి చేరుకుంది.
ఐదు లక్షలకు చేరుతున్న క్రియాశీల కేసులు .. 150 కోట్లకు పైగా టీకా డోసులు
భారతదేశంలో క్రియాశీల కోవిడ్-19 కేసుల సంఖ్య 4,72,169గా ఉంది. క్రియాశీల కేసుల రేటు 1.34 శాతానికి పెరిగిన పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో, యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా 1,00,806 పెరిగాయి. ఇది దేశానికి మరింత ఆందోళన కలిగిస్తోంది. భారతదేశం గత 24 గంటల్లో మొత్తం 90,59,360 డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్ను అందించింది.
దీనితో ఇప్పటివరకు భారతదేశంలో ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 150,61,92,903కి చేరుకుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయిన పరిస్థితి కనిపిస్తుంది.
3,071కి పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
గత 24 గంటల్లో మొత్తం 15,29,948 నమూనాలను కరోనా మహమ్మారి నిర్ధారణ కోసం పరీక్షించారు. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో భారతదేశంలో 64 కొత్త కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీనితో, భారతదేశంలో ఓమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల సంఖ్య 3,071కి పెరిగింది. అందులో ఇప్పటివరకు 1,203 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్న పరిస్థితి ఉంది.