యూరప్ పై భారత్ ఫైర్-రష్యా-ఉక్రెయిన్ పోరును భారత్-చైనా ఉద్రిక్తలతో పోల్చడంపై
యూరప్ దేశాలపై భారత్ మండిపడింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధాన్ని, భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పోలుస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై భారత్ తరఫున విదేశాంగమంత్రి జై శంకర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు జై శంకర్ బ్లటిస్లావాలో జరిగిన ఓ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు.
యూరప్ సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా మార్చడం మానుకోవాలని విదేశాంగమంత్రి జై శంకర్ యూరప్ దేశాలకు ఘాటుగా సమాధానమిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ పోరులో రష్యాకు మద్దతిస్తున్న భారత్ కు భవిష్యత్తులో చైనాతో సమస్యల విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి సాయం దక్కదంటూ యూరప్ దేశాలు చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో యూరప్ దేశాలు చేస్తున్న విమర్శలపై కూడా స్పందించిన ఆయన.. తమ ప్రజల ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు.
చైనాతో భారత్ సంబంధాల గురించి యూరప్ దేశాలు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని జై శంకర్ తెలిపారు. చైనా భారత్ తో ఎప్పుడూ సత్సంబందాలు నెలకొల్పుకోలేదని, భవిష్యత్తులోనూ చైనాతో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోగల సత్తా భారత్ కు ఉందన్నారు. దీనిపై యూరప్ దేశాల వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. చైనాతో ప్రస్తుతం పరిస్ధితులు అంత బాగోలేవని, అయినా భవిష్యత్తులో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తామన్నారు.