వరుసగా రెండో రోజూ.. 4 వేలకు పైగా కరోనా మరణాలు: 4 లక్షలకు పైగా కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. 24 గంటలు గడిచేసరికి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా రెండోరోజు కూడా నాలుగు వేలకు పైగా మరణాలు వెలుగు చూశాయి. నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు భారీగా ఉంటోంది. రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,03,738 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,092 మంది మరణించారు. 3,86,444 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కు చేరింది. ఇందులో ఇప్పటిదాకా 1,83,17,404 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 2,42,362కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 37,36,648గా నమోదైంది. ఒక్క రోజు వ్యవధిలో నాలుగు లక్షల వరకు పేషెంట్లు కోలుకోవడం రికార్డు.
ఈ స్థాయిలో రికవరీలు ఇదివరకెప్పుడూ నమోదు కాలేదు. ఒక్కరోజులో 3,86,444 మంది రికవరీ కావడం ఊరట కలిగిస్తోంది. అదే సమయంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతోన్నాయి. దేశవ్యాప్తంగా 37,36,648 మంది కరోనాకు గురయ్యారు. ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లు, ఐసొలేషన్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇన్ని లక్షల మంది ఒకేసారి వైద్యాన్ని కల్పించలేకపోతున్నాయి ఆయా రాష్ట్రాలు. ఆసుపత్రులు, క్లినిక్లు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడింది.
Recommended Video
ఈ పరిస్థితిని అధిగమించడానికి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు సైతం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోన్నాయి. వందలాది మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. అనేక దేశాలు ఆక్సిజన్ జనరేటర్లు, ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లను భారత్కు సరఫరా చేస్తోన్నాయి. మరోవంక- దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటిదాకా 16,94,39,663 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది. మూడోదశ వ్యాక్సిన్ను చేపట్టడానికి అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి.