కరోనా ఉప్పెన : రికార్డులు బ్రేక్ చేస్తూ మూడు లక్షలను దాటిన తాజా కేసులు, కట్టడి కష్టమే!!
భారత దేశంలో కరోనా పరిస్థితులు కట్టడి తప్పాయి . ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న భారత్ మరింత ప్రమాదంలో పడిపోతుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో భారత్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడు లక్షలు దాటిన కొత్త కేసులు భారత్ కు ఊపిరాడనివ్వడం లేదు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని మార్గాలను అవలంబిస్తున్నా దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారైంది.
గత 24 గంటల్లో భారతదేశంలో 3,14,835 కొత్త కేసులు
తాజాగా భారత దేశంలో కరోనా మహమ్మారి కారణంగా రోజువారి కేసులు రికార్డ్ బ్రేక్ చేశాయి. దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 3,14,835 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సింగిల్ డే స్పైక్ను సాధించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.

నిన్న ఒక్కరోజే భారతదేశంలో 2,104 మరణాలు
కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే భారతదేశంలో 2,104 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మొత్తం మరణాలు 1,84,657 సంభవించాయి . మొత్తం కేసుల సంఖ్య 15.9 మిలియన్లకు చేరుకోగా , క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 22,91,428కి పెరిగింది . రోజువారి కొత్త కేసులు, రోజు వారి మరణాలు భారతదేశంలో రికార్డులను బద్దలు కొడుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందని, తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే రోజువారి కేసుల నమోదు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ దేశంలోనూ కాలేదంటే ప్రస్తుత భారత దేశ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఉధృతంగా రోజువారీ కేసులు ... నిన్న అత్యధికంగా కేసులు నమోదు చేసిన రాష్ట్రాలివే
ఏప్రిల్ 15 నుండి ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని కేంద్రం చెబుతోంది. కేసులు ఎప్పుడు తగ్గుతాయో నిపుణులకు కూడా అంతుచిక్కడం లేదు. మహారాష్ట్ర (67,468), ఉత్తర ప్రదేశ్ (33,106), ఢిల్లీ (24,638), కర్ణాటక (23,558), కేరళ (22,414) కేసులతో ఐదు రాష్ట్రాలు గత 24 గంటల్లో అత్యధికంగా రోజువారీ కేసులను నమోదు చేశాయి .
లాక్ డౌన్ తప్పేలా లేదనిపించేలా కరోనా ఉప్పెన
ఇప్పటికే అనేక రాష్ట్రాలు కరోనా మహమ్మారి వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్, 144 సెక్షన్ వంటి ఆంక్షలను ప్రకటించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం గా మారింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ "లాక్ డౌన్ చివరి అస్త్రం" అని స్పష్టం చేసిన నేపథ్యంలో , తాజా పరిణామాలు లాక్డౌన్ దిశగా దేశం అడుగులు వేస్తుంది అన్న భావన కలిగిస్తున్నాయి. ఇక గడచిన 24 గంటల్లో 16,51,711 కరోనా నిర్ధారణ పరీక్షలు చెయ్యగా 3,14,835మందికి పాజిటివ్ గా తేలింది.
పడిపోయిన రికవరీ రేటు , పెరుగుతున్న యాక్టివ్ కేసుల రేటు
ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 13.82 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయింది . నిన్న ఒక్కరోజే కరోనా నుండి 1,78, 841 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య కోటి ముప్పై నాలుగు లక్షల మందికి చేరుకుంది . దేశంలో కరోనా దారుణ పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో , ప్రస్తుతం అనుసరిస్తున్న కరోనా కట్టడి మార్గాలతో ప్రయోజనం లేదని, లాక్ డౌన్ విధించాల్సి వస్తుందేమో అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications