కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఒక్కరోజులో 15,412 కొత్త కేసులు.. ఆ ట్యాబ్లెట్తో ఊరట లభించేనా?
ఇంకో పది రోజుల్లో అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్-19 కొత్త కేసులకు సంబందించి భారత్ లో మరో రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,413 మందికి వైరస్ సోకగా, 306 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం కొత్తవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4.10లక్షలకు పెరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,254కు చేరింది. రికవరీ రేటులోనూ భారత్ మెరుగ్గా ఉండటంతో ఇప్పటికే 2.27లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, దాదాపు 1.70లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
Recommended Video

గ్లోబల్గా నాలుగో స్థానంలో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 4.67లక్షలుగా ఉంది. కొవిడ్-19 వల్ల తీవ్రంగా ఎఫెక్టయిన దేశాల జాబితాలో.. 4.10లక్షల కేసులతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మనకంటే లక్షన్నర ఎక్కువ కేసులతో రష్యా మూడో స్థానంలో ఉండగా, 10లక్షలకుపైగా కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో, 23 లక్షలకుపైగా కేసులతో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి.

టెస్టుల వేగం పెంపు..
దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(సామూహిక వ్యాప్తి) జరగడంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. అయితే కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తోన్న నేపథ్యంలో టెస్టుల వేగాన్ని పెంచినట్లు తెలిపింది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 68లక్షలకు పైగా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ బాధ్యులు వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీలో మరణాలు అధికంగా నమోదవుతుండటంతో గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా శాంపిల్స్ సేకరిస్తున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1.28లక్షల కేసులు, దాదాపు 6వేల మరణాలు నమోదుకాగా, తమిళనాడులో 56వేల కేసులు, 704 మరణాలు చోటుచేసుకున్నాయి.

అందుబాటులోకి మందు..
కొత్త కేసులు భారీగా పెరుగుతోన్న వేళ భారతీయ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్.. కరోనా వైరస్ నియంత్రణకు ఔషధాన్ని కనిపెట్టామంటూ ప్రకటించడం తెలిసిందే. ‘‘ఫవిపిరవిర్''పేరుతో రూపొందించిన ట్యాబ్లెట్.. స్వల్ప, మధ్యస్థ రోగ లక్షణాలున్న వారిపై బాగా పనిచేస్తున్నదని, క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని గ్లెన్ మార్క్ చైర్మన్ గ్లెన్ సల్దన్హా వెల్లడించారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు కూడా పొందిన ఈ మందు శుక్రవారం నుంచే మార్కెట్లలోకి అందుబాటులోకి వచ్చింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.103గా నిర్ధారించారు. కొవిడ్-19 కేసుల్లో 85 శాతం వరకు స్వల్ప, మధ్యస్త లక్షణాలవారే ఉంటున్న నేపథ్యంలో ‘ఫవిపిరవిర్' ఊరటకలిగించొచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications