కరోనా తగ్గుముఖం- 2 లక్షల దిగువకు రోజువారీ కేసులు- 40 రోజుల తర్వాత
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన రోజువారీ హెల్త్ బులిటెన్లో గత 24 గంటల్లో 2 లక్షల కన్నా తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. 40 రోజుల తర్వాత తొలిసారి 2 లక్షల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు మాత్రం ఆగడం లేదు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3511 మంది కరోనాతో చనిపోయారు.రికవరీల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం అందరికీ ఊరటనిస్తోంది.
క్రమంగా కరోనా తగ్గుముఖం
దేశవ్యాప్తంగా మార్చి మూడో వారంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా అదుపులోకి వస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్, మరోవైపు భారీగా టెస్టులు, చికిత్సలు జరుగుతుండటంతో కరోనా ప్రభావం తగ్గుతోంది. 40 రోజుల్లో తొలిసారి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 లక్షల కన్నా దిగువకు చేరుకుంది. కేంద్రం తాజాగా ప్రకటించిన హెల్త్ బులిటెన్లో కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరగడం భారీగా ఊరటనిస్తోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
40 రోజుల దిగువకు కొత్త కేసులు
కరోనా కొత్త కేసుల సంఖ్య తాజాగా భారీగా తగ్గుతోంది. రెండు వారాల క్రితం 4 లక్షలుగా ఉన్న రోజువారీ కొత్త కేసులు ఇప్పుడు ఏకంగా 2 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. కేంద్రం తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కేవలం 1.96 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం ఊరటనిస్తోంది. అయితే 3511 మరణాలు చోటు చేసుకోవడం మాత్రం కేంద్రానికి ఆందోళన రేపుతోంది. వాస్తవానికి కరోనా ఫస్ట్వేవ్తో పోలిస్తే సెకండ్వేవ్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.
వరుసగా 12వ రోజు పెరిగిన రికవరీలు
వరుసగా 12వ రోజు దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో 1.96 కొత్త కేసులు నమోదైతే.. 3.26 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం రికవరీల సంఖ్య 2.4 కోట్లకు చేరుకుంది. తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 2.69 కోట్లు కాగా... యాక్టివ్ కేసుల సంఖ్య 25.86 లక్షలు కాగా.. మొత్తం మరణాలు 3.07 లక్షలకు చేరాయి.
కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలివే
దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో టాప్ 5 జాబితాను కూడా కేంద్రె వెల్లడించింది. ఇందులో తాజాగా పశ్చిమబెంగాల్ కూడా చేరింది. ఇందులో గత 24 గంటల్లో తమిళనాడు 34867 కేసులతో అగ్రస్ధానంలో ఉండగా.. 25311 కేసులతో కర్నాటక ద్వితీయ స్ధానంలోనూ, 22,122 కేసులతో మహారాష్ట్ర మూడో స్ధానంలో, 17883 కేసులతో పశ్చిమబెంగాల్ నాలుగో స్ధానంలో, 17821 కేసులతో కేరళ ఐదో స్ధానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 60 శాతం కొత్త కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
మరణాల్లో మహారాష్ట్ర (592) తొలిస్దానంలో, కర్నాటక (529) రెండో స్ధానంలో నిలిచాయి.