మగ్గుతున్న కరోనా వ్యాక్సిన్లు- సమీపిస్తున్న ఎక్స్పైరీ- వ్యాక్సినేషన్, ఎగుమతి కష్టమేనా ?
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వ్యాకిన్ల తయారీలో భారత్ ఎంతో ముందుంది. ఇప్పటికే కోట్లాది వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయడమే కాదు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు వాటిని వాడటం, అలాగే విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. అయితే దేశంలో సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల గడువు ముగిసిపోక ముందే వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం తొందరపడుతోంది. కానీ దేశంలో బహిరంగ మార్కెట్లో అమ్మకాలకు మాత్రం అనుమతించడం లేదు. దీంతో తదుపరి సాగే వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు విదేశీ ఎగుమతులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నత్తనడకన కరోనా వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకూ హెల్త్ వర్కర్లు, పోలీసులు, డాక్టర్లతో పాటు తాజాగా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. అలాగే 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారిలోనూ తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. అయినా ఇప్పటివరకూ కేవలం 3.48 కోట్ల వ్యాక్సిన్లను మాత్రమే వేశారు. జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనా ఇప్పటివరకూ నాలుగు కోట్ల వ్యాక్సిన్లు కూడా వేయలేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అవగాహన లేకపోవడం, వారిని ఒప్పించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

వ్యాక్సినేషన్కు సమానంగా విదేశీ ఎగుమతులు
దేశంలో ఇప్పటివరకూ హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు, వృద్ధులకు వేస్తున్న వ్యాక్సిన్లకు తోడు దాదాపు 50 దేశాలకు కేంద్రం మన వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తోంది. ఓవైపు అంతర్జాతీయంగా భారత్ ఈ విషయంలో ప్రశంసలు కూడా అందుకుంటోంది. అయితే విదేశాలకు భారీ స్ధాయిలో వ్యాక్సిన్ల ఎగుమతికి కారణం దేశీయంగా నత్తనడకన సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న వ్యాక్సినేషన్కు అంతగా డిమాండ్ లేకపోవడంతో కేంద్రం తప్పనిసరి పరిస్ధితుల్లోనూ విదేశాలకు వ్యాక్సిన్లను అంత ఉదారంగా ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ దేశీయంగా 3.48 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయగా.. విదేశాలకు 3.39 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఎగుమతి చేశారు.

వచ్చేనెలలో వ్యాక్సిన్ల ఎక్స్పైరీ డేట్
భారత్లో ఇప్పటికే తయారై పంపిణీకి సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్ల ఎక్స్పెయిరీ డేట్ వచ్చే నెలతో ముగియబోతున్నట్లు తెలుస్తోంది. అయినా దేశీయంగా నత్తనడకన సాగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా విదేశీ ఎగుమతులు తప్పనిసరిగా మారిపోయాయి. లేకపోతే వృధాగా వీటిని చెత్త బుట్టలోకి విసిరేయాల్సిన పరిస్ధితి తలెత్తబోతోంది. అందుకే కేంద్రం తన ప్రయత్నాలతో పాటు వీటి తయారీ సంస్ధలను సైతం విదేశాల్లో అమ్ముకునేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తోంది. ఒకవేళ వచ్చే నెలలో వ్యాక్సిన్లు ఎక్స్పైరీ కాకముందే వీటిని దేశీయంగా వ్యాక్సినేషన్లో వాడటం లేదా విదేశాలకు ఎగుమతులు చేయడం కేంద్రానికి తప్పనిసరిగా మారిపోయింది.

దేశీయ అమ్మకాలకు అనుమతులివ్వని కేంద్రం
కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ సంస్ధలకు ప్రత్యేకంగా అత్యవసర అనుమతిచ్చిన కేంద్రం దేశీయంగా మాత్రం వాటిని అమ్ముకోనివ్వడం లేదు. దేశీయంగా ప్రస్తుతం కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియలో మాత్రమే వ్యాక్సిన్లను ఉపయోగిస్తోంది. బహిరంగ మార్కెట్లో అమ్మకాలకు మాత్రం అమ్మకాలు జరగడం లేదు. త్వరలో అనుమతి ఇస్తామని చెబుతున్నా అది ఎప్పటివరకూ అందుబాటులోకి వస్తుందో తెలియదు. కానీ విదేశాలకు ఎగుమతులు మాత్రం సాగిపోతున్నాయి. వచ్చే నెలలో వ్యాక్సిన్ల ఎక్స్పైరీ డేట్ ముగియకముందే వీటిని వ్యాక్సినేషన్లోనూ, ఎగుమతులకు వాడేసేందుకు తొందరపడుతున్న కేంద్రం.. దేశీయ విక్రయాలకు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications