మోడీ సర్కార్కు కఠిన సవాల్: దేశంలో రికార్డు స్థాయికి నిరుద్యోగం: సీఎంఐఈ షాకింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ శాతం భారీగా పెరిగింది. ప్రతి నెలా ఇది పెరుగుతూనే వస్తోంది. ఈ సంవత్సరం మార్చి-ఏప్రిల్ నెలల మధ్య నిరుద్యోగ శాతంలో ఆందోళనకరంగా పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో పట్టణ ప్రాంతాలు, నగరాలు అనే తేడా ఉండట్లేదు. పట్టణాలు, నగరాల్లో నిరుద్యోగ శాతంలో పెరుగుదల కనిపించింది. ఈ తరహా పరిణామాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవని, తక్షణమే నివారణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిరుద్యోగ శాతంలో పెరుగుదల..
దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) కీలకమైన సర్వే నిర్వహించింది. దీనిపై ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. పలు కీలక విషయాలను ఇందులో పొందుపరిచింది. ఏప్రిల్లో నిరుద్యోగ రేటు 7.83 శాతం మేర నమోదైనట్లు తెలిపింది. మార్చిలో నమోదైన నిరుద్యోగ శాతంతో పోల్చి చూస్తే పెరుగుదల కనిపించింది. మార్చిలో 7.60 శాతం మేర ఉన్న ఈ సంఖ్య ఏప్రిల్ నాటికి 7.83 శాతానికి పెరిగింది.

హర్యానాలో అత్యధికం..
ప్రత్యేకించి- పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం పెరుగుదలలో వేగం నెలకొంది. మార్చిలో 8.28 శాతంగా ఉన్న పట్టణ ప్రాంత నిరుద్యోగిత ఏప్రిల్ నాటికి 9.22కు చేరుకుంది. ఈ తరహా వేగం ఇదివరకెప్పుడూ లేదని సీఎంఐఈ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 7.29 శాతం నుంచి 7.18 శాతానికి క్షీణించినట్లు పేర్కొంది. దేశంలో అత్యధిక నిరుద్యోగ శాతం నమోదైన రాష్ట్రం- హర్యానా. 34.5 శాతం మేర నిరుద్యోగిత ఈ రాష్ట్రంలో రికార్డయింది.

రాజస్థాన్, బిహార్లల్లో..
రాజస్థాన్, బిహార్ ఆ తరువాతి స్థానాలో ఉన్నాయి. 28.8 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 21.1 శాతంతో బిహార్ మూడో స్థానానికి చేరింది. నిరుద్యోగుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, అస్సాం ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు మందగించడం వల్లే ఈ పరిణామాలు తలెత్తాయని సీఎంఐఈ తెలిపింది. ధరల పెరుగుదల కూడా నిరుద్యోగం పెరగడానికి కారణమైందని స్పష్టం చేసింది. ధరల పెరుగుదల వల్ల మార్కెట్లో రొటేషన్ పద్ధతి, కొనుగోళ్లు భారీగా తగ్గాయని, ఫలితంగా పలు కంపెనీలకు డిమాండ్ మందగించిందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.

క్షీణించిన ప్రొడక్టివిటీ
ప్రొడక్టివిటీ క్షీణించడం, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం వల్ల ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోయాయని పేర్కొంది. ఖర్చులను తగ్గించకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించలేకపోయిందని వ్యాఖ్యానించింది. మార్చిలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠానికి అంటే- 6.95 శాతానికి చేరిందని, ఏప్రిల్లో ఇది 7.5 శాతాన్ని దాటొచ్చని సింగపూర్కు చెందిన ఆర్థిక నిపుణుడు షలీన్ షా చెప్పారు.












Click it and Unblock the Notifications