మే 1 నాటికి భారత్కు రష్యా స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో నెలకొన్ని విపత్కర పరిస్థితుల్లో మనదేశానికి అండగా ఉంటామంటూ ప్రపంచ దేశాలు కదిలివస్తున్నాయి. ఆక్సిజన్ తోపాటు వ్యాక్సిన్ కొరతను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన వ్యాక్సిన్ ను భారత్కు అందించేందుకు సిద్ధమైంది.
తొలి బ్యాచ్ స్పుత్నిక్ వీ టీకా డోసులు మే 1న భారత్కు చేరుకోనున్నట్లు రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రివ్ వెల్లడించారు. అయితే, తొలి కన్సైన్మెంట్లో ఎన్ని టీకాలు ఉండనున్నాయి, వాటిని ఎక్కడ తయారు చేయనున్నారన్న విషయాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
మే 1వ తేదీన తొలి డోసులు భారత్కు టీకాలు డెలివరీ అవుతాయన్నారు. వేసవి చివరి నాటికి భారత్లో నెలకు 50 మిలియన్ డోసుల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది.
ఆర్డీఐఎఫ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారతదేశంలో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు దేశీయ ఫార్మా దిగ్గజం రెడ్డీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది రెడ్డీస్. ఈ క్రమంలో ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్ ఫలితాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ మనదేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించింది.