India tour of Sri Lanka 2021: వన్డే, టీ20ల్లో సారధిగా శిఖర్ ధావన్, భువీ వైస్ కెప్టెన్ -5గురు కొత్తవాళ్లకు చోటు
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లంతా ఇంగ్లాండ్ టూర్ లో ఉండగా, షెడ్యూల్ ప్రకారం శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన భారత జట్టును బీసీసీఐ గురువారం రాత్రి ప్రకటించింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో వన్డే, టీ20 మ్యాచ్ లకు భారత సాధిగా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. భువనేశ్వర్ కుమార్ కు తొలిసారిగా వైస్ కెప్టెన్ పగ్గాలు చిక్కాయి. శ్రీలంక టూర్ కోసం జట్టులోకి కొత్తగా ఐదుగురు కొత్తవాళ్లను తీసుకున్నారు. వారంతా ఐపీఎల్ లో మెరిసిన కుర్రాళ్లే కావడం గమనార్హం.
శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో 20 మంది ఆటగాళ్లతో పాటు 5 నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. యువకులతో కూడిన జట్టు త్వరలోనే శ్రీలంకకు పయనమవనుంది. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియాలకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం లభించింది. వీరంతా గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ టోర్నీలో రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
శిఖర్ ధావన నేతృత్వంలోని భారత జట్టు జులైలో శ్రీలంకతో తలపడనుంది. ఈ సిరీస్లో భారత -శ్రీలంకలు మొత్తం 3 వన్డే మ్యాచ్లు, 3 టీ20లు ఆడనుంది. జులై 13న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్లు శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. శ్రీలంక టూర్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టు పూర్తి వివరాలివి..
భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, నితిష్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్(వికెట్ కీపర్),యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె.గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా. ఇక నెట్ బౌలర్స్ గా ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్ లను ఎంపిక చేశారు.