ఆప్ఘనిస్తాన్ జైల్లో కేరళ మహిళల కన్నీటి వ్యధ-భారత్ తిరిగొస్తానంటే కేంద్రం నో-షాకింగ్ రీజన్
కేరళ నుంచి భర్తలతో కలిసి వెళ్లి అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధ ఐసిస్లో చేరారు. తీవ్రవాద దాడుల్లో భర్తల్ని కోల్పోయారు. చివరికి ఆప్ఘనిస్తాన్లో తీవ్రవాదులకు సహకరించారనే ఆరోపణలపై జైలు పాలయ్యారు. ఇప్పుడు పశ్చాతాపం మొదలైంది. భారత్కు తిరిగొచ్చేస్తామంటున్నారు. కేంద్రం మాత్రం నో అంటోంది. దీంతో భారత్-ఆప్ఘన్ దేశాల మధ్య ఈ వ్యవహారంపై చర్చలు సాగుతున్నాయి. వీరిని విడిపేందుకు పలువురు రంగంలోకి దిగినా భారత్ కుదరదని చెప్పేస్తే మాత్రం ఇక వారు ఆప్ఘన్ జైళ్లలో జీవితం గడిపేయాల్సిందే.
భర్తలతో కలిసి ఐసిస్లోకి...
2016 నుంచి 2018 మధ్య కేరళ నుంచి భారీ ఎత్తున అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసిస్లో రిక్రూట్మెంట్ జరిగింది. అప్పట్లో భర్తలతో కలిసి నలుగురు కేరళ మహిళలు ఐసిస్ వైపు ఆకర్షితులయ్యారు. సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయిషా, రఫేలా, మెర్రిన్ జాకబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా భర్తలతో కలిసి ఐసిస్లో చేరారు. అనుకున్నదే తడవుగా ఐసిస్ చెప్పినట్టు ఆడుతూ కేరళ నుంచి బయలుదేరి ఆప్ఘనిస్తాన్లోని నంగార్హర్ ప్రావిన్స్కు చేరుకున్నారు. ఆ తర్వాత వీరందరినీ ఐసిస్ వివిధ దాడుల్లో వాడుకుంది. భర్తలు నేరుగా దాడుల్లో పాల్గొంటుంటే వీరు వెనకుండి సహకరించేవారు. అలా కొంతకాలం సాగాక ఓ రోజు వీరికి భారీ షాక్ ఎదురైంది.
తీవ్రవాద దాడుల్లో భర్తల్ని కోల్పోయాక
ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ దళాలతో సాగించిన పోరులో భాగంగా పలు చోట్ల ఐసిస్ ఆత్మాహుతి దాడులకు తెగబడింది. ఇందులో నలుగురు కేరళ మహిళల భర్తలు చనిపోయారు. 2019లో ఇలా భర్తల్ని కోల్పోయిన తర్వాత వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఐసిస్లో పురుషులకు ఉన్న విలువ మహిళలకు ఉండదు. కీలకమైన దాడుల్లో మహిళల్ని వాడుకునేది తక్కువే. భర్తల్ని కోల్పోయిన తర్వాత ఐసిస్లో కొనసాగలేక, వదిలి వెళ్లలేక ఎలాగోలా తప్పించుకుని మరికొందరితో కలిసి వీరు ఆప్ఘన్ దళాలకు లొంగిపోయారు.
అప్పగింతకు సిద్దమైన ఆఫ్ఘన్ సర్కార్
2019 ఏప్రిల్లో 13 దేశాలకు చెందిన 408 ఐసిస్ సానుభూతిపరుల్ని అరెస్టు చేసి జైళ్లకు పంపినట్లు ఆప్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భారత్కు చెందిన నలుగురు మహిళలతో పాటు 16 చైనీయులు, 299 పాకిస్తానీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. వీరందరినీ స్వదేశాలకు అప్పగించేందుకు ఆప్ఘనిస్తాన్ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆయా దేశాలతో చర్చలు జరిపి వీరిని సురక్షితంగా అప్పగిస్తామని తెలిపింది. అప్పటి నుంచి ఆయా దేశాలతో చర్చలు జరుపుతూనే ఉంది. మిగతా దేశాల వ్యవహారం ఎలా ఉన్నా నలుగురు కేరళ మహిళల వ్యవహారంలో మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదు.
కేరళ మహిళల రిటర్న్కు కేంద్రం నో ?
ఐసిస్లో చేరేందుకు భారత్ వీడిన నలుగురు కేరళ మహిళల్ని తిరిగి అక్కున చేర్చుకునేందుకు కేంద్రం ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా బయటికి చెప్పకపోయినా నలుగురు మహిళల్ని తిరిగి కేరళలోకి అనుమతిచ్చేందుకు కేంద్రం ఇష్టపడటం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. వీరి ప్రవర్తనా శైలి రాడికల్గా ఉందని, వారిని ఆప్ఘన్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్ వినతి మేరకు ఇంటర్పోల్ ఈ నలుగురు యువతులపై రెడ్నోటీసులు జారీ చేసింది. భారత్లో 2017లోనే ఎన్ఐఏ వీరిపై ఛార్జిషీట్ నమోదు చేసింది. ఈ కేసుల విచారణ పెండింగ్లోనే ఉంది.