దుబాయ్లో భారత సినీ నిర్మాత ఫ్యామిలీ మృతి
దుబాయ్: కేరళ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, ఆయన కూతురు, భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దుబాయ్లోని ఓ ఫ్లాట్లో కేరళకు చెందిన సినీ నిర్మాత సంతోష్ కుమార్, ఆయన భార్య మంజుల, కుమార్తె గౌరిల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో గుర్తించినట్లు అక్కడి మీడియా కథనాలు వెలువరించాయి.
సంతోష్ కుమార్కు సౌపర్ణిక ఫిలింస్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆయన ‘మదాంబి' అనే మలయాళ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఐదేళ్ల క్రితం దుబాయ్కి వెళ్లిన సంతోష్ కుమార్ అక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు.
కాగా, మృతదేహాలకు కత్తిపోట్లు ఉన్నాయని మృతుడి బంధువులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు దుబాయ్ పోలీసులు నిరాకరిస్తున్నారు. సినీ నిర్మాత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సినీ నిర్మాత సంతోష్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మరికొందరు అనుమానిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు మృతికి గల సరైన కారణాలు తెలియరాలేదు. గత గురువారం నుంచి సంతోష్ కుమార్ కుటుంబంలో ఎవరూ ఫోన్లో దొరకకపోవడంతో ఆయన సమీప బంధువు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు. ముగ్గురి మృతదేహాలు బెర్రూంలో కనిపించాయి.