ఆర్మీ ఆస్పత్రి నుండి ఎయిమ్స్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ .. ఆయన ఆరోగ్యంపై మోడీ ఆరా !!
భారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే . రామ్ నాథ్ కోవింద్ ఛాతీ అసౌకర్యానికి గురైనట్లుగా చేసిన ఫిర్యాదు తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు.
అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై తదుపరి పరిశీలన కోసం, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపించబడ్డారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వివరించింది.
ఇదే సమయంలో రాష్ట్రపతి పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం ఇచ్చింది. శుక్రవారం ఛాతీ అసౌకర్యం గురించి ఫిర్యాదు చేయడంతో కోవింద్ ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఆయన జనరల్ చెకప్ అనంతరం ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇక తాజాగా ఆయనను ఎయిమ్స్ లో చేర్పించారు . నిన్నటి నుండి రాష్ట్రపతి పరిస్థితి గురించి పలువురు నాయకులు ఆరా తీశారు. ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తనయుడితో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమారుడితో మాట్లాడారని , ఆయన రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారని , అతని శ్రేయస్సు కోసం ప్రార్థించారని పిఎంఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు.రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు . భారతదేశంలో పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆర్మీ ఆసుపత్రిలో తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. కానీ అప్పటి నుండి ఆయనకు ఎలాంటి అస్వస్థత లేదు.
తాజాగా ఛాతీలో అసౌకర్యంగా ఉందన్న కారణంతో ఆయన ఆస్పత్రిలో చేరారు . వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆయన ఛాతీలో అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దని భావిస్తున్న ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఆయనను తదుపరి పరీక్షలకు ఎయిమ్స్ కు రిఫర్ చేశారు . 75 సంవత్సరాల భారత రాష్ట్రపతి ఆరోగ్యం పట్ల వైద్యులు శ్రద్ధ తీసుకుంటున్నారు . ఇక రామ్ నాథ్ కోవింద్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆయన సతీమణి, దేశ తొలి మహిళ సవితా కోవింద్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు .












Click it and Unblock the Notifications