దుబాయ్లో భారతీయ మహిళా కండక్టర్ను చంపిన భర్త
గురువారం పట్టపగలు అల్ గర్హౌడ్లోని న్యూ ఇండియన్ మోడల్ స్కూలు వెలుపల కేరళకు చెందిన 30 ఏళ్ల యువతి సోనియాను ఆమె భర్త రంజిత్ ఛాతి పైన, శరీరంలోని ఇతర అవయవాలపైన అయిదుసార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచాడని ‘ఖలీజ్ టైమ్స్' పత్రిక తెలిపింది.
అనంతరం ఆమె భర్త అదే కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడని ఆ పత్రిక తెలిపింది. భర్తను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దంపతుల మధ్య కొంతకాలంగా సత్సంబంధాలు లేవని, వీరికి కేరళలో స్కూలుకు వెళ్లే వయసులోని ఇద్దరు పిల్లలున్నారని కూడా ఆ పత్రిక తెలిపింది.
ఆ మహిళ బస్సు ఎక్కుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడని, జేబులోంచి కత్తి తీసి తీవ్రంగా గాయపరిచాడని సాక్షులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన సోనియా సంఘటన స్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆమె చనిపోయిన చోటికి పదిహేను మీటర్ల దూరంలో ఒక వ్యక్తి తీవ్రమైన రక్తస్రావంతో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న భర్తను ఆసుపత్రికి తరలించారు.