Chandrayaan 3 landing: జయహో భారత్: చంద్రమండల యానం దిగ్విజయం
బెంగళూరు: నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కొద్దిసేపటి కిందటే జాబిల్లి మీద అడుగు మోపింది.
ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. కలలు సాకారం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ జాబిల్లిని అందుకుంది ఇస్రో. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్లు కొద్దిసేపటి కిందటే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.

చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.
అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది. దీనితో- అప్పటివరకు పిన్ డ్రాప్ సైలెంట్గా కనిపించిన ఇస్రో మిషన్ కాంప్లెక్స్ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఆలింగనం చేసుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ క్షణం కోసం టీవీలు, ఇంటర్నెట్, యూట్యూబ్ల వద్ద ఎదురు చూస్తూ కూర్చున్న దేశ ప్రజలు.. ఒక్కసారిగా జయజయ ధ్వానాలు చేశారు. జయహో భారత్.. అంటూ నినదించారు. కోట్లాది మంది ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్బర్గ్ నుంచి మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఆ మిషన్ సక్సెస్ అయినట్లు సోమనాథ్ తెలిపారు. భారత్.. చంద్రుడిపై అడుగుపెట్టిందని విస్పష్ట ప్రకటన చేశారు. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని ఉద్వేగంగా ప్రకటించారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువేళ్ను అభినందించారు.












Click it and Unblock the Notifications