పాకిస్తాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం... కారణమిదే...
షార్జా నుంచి లక్నోకు వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ రీత్యా పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో వెంటనే విమానాన్ని కరాచీకి మళ్లించారు. ఇందుకోసం పాకిస్తాన్ అధికారుల అనుమతి తీసుకున్నారు. అయితే కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయానికే ఆ ప్రయాణికుడు మృతి చెందాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విమానంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. అతని మరణాన్ని విమానాశ్రయంలోని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడిని హబీబ్ రెహమాన్(67)గా గుర్తించారు.
ఇండిగోకి చెందిన 6E 1412 విమానం మంగళవారం(మార్చి 2) షార్జా నుంచి లక్నోకి వస్తుండగా ఈ ఘటన చోట చేసుకుంది. తెల్లవారుజామున 4గంటల సమయంలో ఇండిగో నుంచి ఎమర్జెన్సీ ల్యాండింగ్కి తమకు సందేశం అందిందని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. విమానంలోని కెప్టెన్ పాకిస్తాన్ ఎయిర్ కంట్రోల్ టవర్కు సమాచారమిచ్చారని... మానవతాదృక్పథంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అనుమతి కోరారని తెలిపారు. దీంతో వెంటనే పాక్ అనుమతినివ్వడంతో తెల్లవారుజామున 5గంటల సమయంలో విమానం కరాచీలో ల్యాండ్ అయినట్లు చెప్పారు.
ప్యాసింజర్ మృతిపై ఇండిగో విచారం వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ కూడా ఇస్లామాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఇంధనం నింపుకునేందుకు ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.ఆ సమయంలో ఓ బ్రిటీష్ పేషెంట్ను భారత్లోని కోల్కతా నుంచి తజకిస్తాన్ రాజధాని దుషన్బేకి తరలిస్తున్నారు. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధికారులను సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. ఆపై ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ అంబులెన్స్.. ఇంధనం నింపుకుని రెండు గంటల తర్వాత తజికిస్తాన్కు బయల్దేరింది.