మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అగ్నిప్రమాదం: గాఢ నిద్రలో ఏడుగురు సజీవదహనం; సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇండోర్ లోని ఒక భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘోర అగ్ని ప్రమాదం నుండి 9మంది రక్షించబడ్డారు. ఏడుగురు మృతి చెందటంతో ఇండోర్ లో విషాద చాయలు అలముకున్నాయి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని రెండంతస్తుల భవనంలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారు. వీరిలో ఐదుగురిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల బంధువుల, క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోతుంది. ఇక అగ్నిప్రమాద ఘటన తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పటం కోసం మూడు గంటల పాటు శ్రమించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇండోర్లోని స్వర్న్ బాగ్ కాలనీలో ఉన్న భవనం యొక్క బేస్మెంట్లో ఈ రోజు ఉదయం 3.10 గంటలకు నివాసితులు నిద్రిస్తున్న సమయంలో ప్రధాన విద్యుత్ సరఫరా వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలకు వ్యాపించాయి, వేగంగా చెలరేగిన మంటలతో భవనం మొత్తం దగ్ధమైంది. భవనం యజమాని అన్సార్ పటేల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .
7 die in fire at Indore building, nine rescued, the fire was triggered by short circuit in main electric supply system in the basement 5 people still hospitalized @ndtv @ndtvindia pic.twitter.com/Qtq89HYX95
— Anurag Dwary (@Anurag_Dwary) May 7, 2022
ప్రతి అంతస్తులో ఒక ఫ్లాట్ ఉన్న భవనంలో అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేయకపోవడంతో, నిర్లక్ష్యంతో మరణానికి కారణమైనందుకు అతనిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాద ఘటనపై సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని , ఈ ప్రగాఢ దుఃఖాన్ని తట్టుకునేలా కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ద్కర్యాప్థు చేస్తున్నారు.