రాహుల్ పాదయాత్రకు జగన్ తో పోలిక-అవమానం-పోరాటం-జనాదరణ-అధికారం దక్కేనా ?
గతంలో ఏపీ మాజీ సీఎం వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత చనిపోయిన వారి కుటుంబాల్ని ఓదార్చేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించింది. ఢిల్లీకి పిలిపించి యాత్రను ఆపేయాలని వార్నింగ్ ఇచ్చి సోనియా, రాహుల్ అవమానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైసీపీని స్ధాపించి 2014లో ఓటమిపాలై ఆ తర్వాత 2018లో పాదయాత్ర ప్రారంభించి జగన్ గెలిచారు. ఇప్పుడు రాహుల్ కూడా దాదాపు అదే స్దాయిలో బీజేపీ చేయిస్తున్న ఈడీ దాడులతో అవమానం పాలై భారత్ జోడో యాత్ర ప్రారంభించి జనంలోకి వెళ్తున్నారు. దీంతో అప్పట్లో జగన్, ఇప్పుడు రాహుల్ పాదయాత్రలకు పోలిక కనిపిస్తోంది.

రాహుల్ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ యువనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. బీజేపీ సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో పేరుతో పాదయాత్ర చేపట్టారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ లోని శ్రీనగర్ వరకూ ఈ యాత్ర సాగించబోతున్నారు. కన్యాకుమారిలో ఐదు రోజుల క్రితం ప్రారంభమైన ఈ యాత్ర కేరళలో దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రకు మద్దతుగా తటస్ధులు, విద్యార్ధులు, ఇతర వర్గాలు తరలివస్తున్నారు. అదే సమయంలో రాహుల్ యాత్రకూ, గతంలో ఏపీ వైఎస్ జగన్ చేపట్టిన యాత్రను పోలుస్తూ చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఈ రెండు యాత్రల వెనక ఉన్న నేపథ్యమే.

రాహుల్, జగన్ యాత్రలకూ పోలిక
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకూ, గతంలో ఏపీలో వైఎస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకూ మధ్య పోలికలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు యువనేతలు గతంలో తాము ఎదుర్కొన్న అనుభవాలు, భవిష్యత్తు లక్ష్యాల కోసమే ఈ పాదయాత్రలు చేపట్టారు. అలాగే ఈ ఇద్దరూ అవమానాలు ఎదుర్కొన్న తర్వాత జనంలోకి వెళితే ఇద్దరికీ ప్రజాదరణ కూడా అదే స్దాయిలో లభించింది. ఫలితాల విషయానికొస్తే జగన్ అద్భుత విజయం సాధిస్తే.. రాహుల్ కు అధికారం దక్కుతుందా లేదా అన్నది ఇంకా తేలడం లేదు.

అవమానం నుంచి ఆదరణ వరకూ..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రధాన కారణం బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఈడీ దర్యాప్తు పేరుతో తనను, తన తల్లి సోనియాగాంధీని విచారణల పేరుతో ఇబ్బందుల పాలు చేయడం, అడ్డొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీలు, నేతల్ని పోలీసుల సాయంతో అడ్డుకోవడం, అవమానించడమే. దీంతో రాహుల్ గాంధీ బీజేపీ విద్వేష వ్యవహారశైలికి నిరసనగా భారత్ జోడో యాత్రను చేపట్టారు. భారత్ జోడో పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే యాత్ర ప్రారంభించారు. జనంలోకి వెళ్లి ఆదరణ పొందుతున్నారు. గతంలో వైఎస్ జగన్ కూడా ఇదే తరహాలో సోనియా గాంధీ చేతుల్లో తాను,తన తల్లి, చెల్లి అవమానపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించి జనంలోకి వెళ్లి పోరాడారు. తొలుత తాను, తన తల్లి ఉపఎన్నికల్లో గెలిచి, అనంతరం 18 ఉపఎన్నికల్లో తమ అభ్యర్ధుల్ని గెలిపించి.. చివరికి పాదయాత్ర చేసి 151 సీట్లతో అధికార పగ్గాలు అందుకునే దాకా వెళ్లారు. ఇప్పుడు రాహుల్ యాత్ర ముగిసిన తర్వాత పరిస్ధితులు కూడా కాంగ్రెస్ కు ఇలాగే అనుకూలంగా మారతాయా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications