రైతులపై మళ్లీ విరిగిన లాఠీ: కొత్త ప్రాంతాలకు పాకిన హింస: ఇంటర్నెట్ బంద్: నిప్పుల కుంపటిలా
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహిస్తోన్న ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మక రూపుదాల్చింది. ఈ ఉదయం ఆరంభమైన అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పైగా కొత్త ప్రాంతాలకు విస్తరించడం ఆందోళనకు దారి తీస్తోంది. చారిత్రాత్మక ఎర్రకోటను ముట్టడించిన అనంతరం ఉద్రిక్తత మిన్నంటింది. ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది రైతులు ఎర్రకోట వైపునకు దూసుకుని రావడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. రైతులు, పోలీసులు, ఇతర భద్రతాసిబ్బంది మధ్య కొనసాగుతోన్న దాడులు, లాఠీఛార్జీలతో ఢిల్లీ నిప్పుల కుంపటిలా మారింది.
లాఠీఛార్జీలతో విరుచుకుని పడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా-నంగ్లోయ్ ప్రాంతంలో హింసాత్మక వాతావరణం నెలకొంది. టిక్రీ సరిహద్దుల నుంచి దేశ రాజధానిలోకి వందలాది ట్రాక్టర్లతో ప్రవేశించిన రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ముందుగా నిర్దేశించిన మార్గం గుండా కాకుండా..ఎర్రకోట వైపు కదలడం పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నంగ్లోయ్ వద్ద ట్రాక్టర్ల ప్రదర్శనను అడ్డుకున్నారు. దీన్ని రైతులు ప్రతిఘటించడంతో లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
పోలీసులు వలయంగా ఏర్పడినప్పటికీ.. రైతులు లెక్కచేయలేదు. ట్రాక్టర్లను ముందుకు పోనివ్వడానికి ప్రయత్నించారు. వందలాదిగా ట్రాక్టర్లు బారులుతీరి.. ఎర్రకోట వైపు కదిలి వెళ్తుండటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ ఛార్జీ చేశారు. ట్రాక్టర్ల మీద ఉన్నవారితో పాటు ర్యాలీగా బయలుదేరిన బైకర్లను వెంటపడి, లాఠీఛార్జీ చేశారు. లాఠీఛార్జీని రైతులు ప్రతిఘటించడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవంక ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు పనిచేయట్లేదు. మొబైల్ డేటా వినియోగంపైనా నిషేధాన్ని విధించారు. నంగ్లోయ్, ఐటీఓ, మింటో రోడ్, ఘాజీపూర్, ముకర్బా చౌక్, జీటీ కర్నాల్ రోడ్, ఐటీఓ, యమునా బ్రిడ్జి, సుబ్రమణియన్ భారతి మార్గ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఇంటర్నెట్ సర్వీులు, మొబైల్ డేటా సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. హింసాత్మక పరిస్థితులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేయడాన్ని నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 11:59 నిమిషాల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.