వలస కూలీల విషయంలో ప్రభుత్వాల స్పందన కరువేనా ? వారి బతుకు దుర్భరమేనా ?
దేశ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రజలు బయటకు రావటానికి వీలు లేదని ప్రభుత్వం ప్రకటన చెయ్యటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక ఈ క్రమంలో ఎటువంటి పనులు జరగటం లేదు. దీంతో దినసరి కూలీలు , వలస కూలీల బతుకు భారంగా మారుతుంది . కరోనా వైరస్ తో నెలకొన్న తాజా పరిస్థితులు పేదలకు శాపంగా మారింది. ప్రధాని చేసింది భయానక కరోనా వైరస్ కట్టడికి అయినా సరే నిరుపేదల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఇక ప్రభుత్వాలు కూడా వలస కార్మికుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తుంది.

దుర్భరంగా మారిన వలస కూలీల జీవనం
రోజువారీ కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పని లేక ఇంట్లో కూర్చుంటే పూట గడవని పరిస్థితి . పని లేకపోవడంతో కూలీలకు ఆదాయం లేకుండా పోయింది. దాచుకున్న కొద్ది పాటి డబ్బులు కూడా పెరిగిన ధరల దెబ్బకు ఆవిరి అయిపోయిన పరిస్థితి . అంతే కాదు ప్రభుత్వం అందించే ఆర్ధక సాయం కూడా వారికి అందని పరిస్థితి . దీంతో చాలా మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళితే ప్రభుత్వ ఆసరా దొరుకుతుంది అని భావించి నగరంలో జీవించలేక వారి స్వస్థలాకు ప్రయాణమవుతున్నారు. అందులోనూ ట్రాన్స్ పోర్ట్ సదుపాయం లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇదంతా జాతీయ మీడియాలో చూస్తున్నా ప్రభుత్వాలు మాత్రం స్పందించటం లేదు .

వందల కిలోమీటర్లు కాలినడకన స్వస్థలాలకు పయనం
వందల , వేల కిలోమీటర్ల దూరం కూడా కాలినడకన వెళ్తున్న కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది . ముఖ్యంగా ముంబైలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ రోజువారీ కూలీలు స్వస్థలాలకు వలస పోవడం చాలా బాధాకరంగా మారింది . వలస కార్మికులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇక కేంద్రం సైతం వలస కార్మికుల కోసం ఎలాంటి వెసులుబాటు చెయ్యలేదు .

ముంబై నుండి పెద్ద ఎత్తున కాలినడకన వెళ్తున్న కార్మికులు
మధ్యప్రదేశ్లోని జబుబా, ధార్, బర్వానీ, ఖఆర్ గోనే జిల్లాలకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ముంబైలో కూలీలుగా పనిచేస్తూంటారు. ఇక వీరు ప్రస్తుతం పనులు లేక పిల్లా జెల్లాతో తమ సొంత గ్రామాల బాట పట్టారు . ప్రస్తుతం పనులు లేకపోవడంతో తమ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిని కదిలిస్తే తమ పరిస్థితి చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే వీరి గ్రామాలు ముంబాయి నుంచి 600 కిలో మీటర్లు దూరంలో ఉన్నాయి.
Recommended Video

హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి .. వలస జీవుల విషయంలో ప్రభుత్వాల స్పందనేది ?
ఇక వీరే కాదు తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ నుండి చాలా మంది కూలీలు కూడా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. పనులు లేక నిలువ నీడ లేక వీరంతా గ్రామాలకి వలస పోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ పోతున్నారు. హృదయ విదారకంగా మారిన ఈ దృశ్యాలు వలస కార్మికుల కష్టాన్ని కళ్ళకు కడుతున్నాయి. వీరిని ఆదుకోవటానికి ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు వలస కార్మికుల కోసం కనీసం వారికి భోజన వసతిని కల్పించటమో, లేకా నిత్యావసరాలను అందించటమో కూడా చెయ్యని పరిస్థితి . వారి వేదన అరణ్య రోదనగా మారుతున్న వేళ వారిని ఆదుకోవటానికి కేంద్రం పెద్ద మనసుతో ముందుకు రావాలి . వలస జీవులకు భరోసా ఇవ్వాలి .












Click it and Unblock the Notifications