ఐఎస్ఐకి సమాచారం: జవానుతోపాటు 6గురి అరెస్ట్
జమ్మూ/కోల్కత్తా: పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐతో చేతులు కలిపి, దేశ రహస్యాలు చేరవేస్తున్న ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ బీఎస్ఎఫ్ జవాను కూడా ఉన్నారు. వీళ్లంతా గూఢచర్యానికి పాల్పడ్డారు.
పాకిస్థాన్కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐకు సమాచారం అందిస్తున్న కేసులో అయిదుగుర్ని అరెస్టు చేశారు. డబ్బు కోసం వాళ్లు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. సైనికుల కదిలికలపై ఐఎస్ఐ ఏజెంట్లు సమాచారాన్ని పాకిస్థాన్కు అందిస్తున్నారు. జమ్మూతో పాటు కోల్కత్తాలో ఈ అరెస్టులు జరిగాయి.
ఖఫైతుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజాతో పాటు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్లు పాక్ ఇంటెలిజెన్స్కు పనిచేస్తున్నారు. వీళ్లను జమ్మూలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గుర్ని కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ-మెయిల్, వాట్సప్, వైబర్ నెట్వర్క్ ద్వారా సమాచార బదిలీ జరుగుతోంది. భారత సైనిక దళాల మోహరింపు, వైమానిక కార్యకలాపాల గురించి మాస్టర్ రాజా పాక్కు సమాచారాన్ని ఎప్పటికప్పుడూ అందిస్తున్నాడు.
రాజౌరీ జిల్లాలో ఖఫైతుల్లా ఖాన్ ఓ స్కూల్లో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేశాడు. గూఢచర్యం రాకెట్ నిర్వహిస్తున్న ఖఫైతుల్లా, రషీద్లకు ఐఎస్ఐ సహకారం అందిస్తోంది. ఈ ఇద్దరూ బంధువులే.
కాగా, కోల్కతాలో 51 ఏళ్ల ఇర్షాద్ అన్సారీతో పాటు అతని కుమారుడు అస్ఫక్ అన్సారీ, మొహ్మద్ జహంగీర్లను అదుపులోకి తీసుకున్నారు. అన్సారీకి కరాచీలో బంధువులు ఉన్నారు. అతను అక్కడికి వెళ్లినప్పుడు ఐఎస్ఐ వాళ్లను లోబర్చుకుంది.
సుమారు పదేళ్ల నుంచి అన్సారీ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడు. వాళ్ల నుంచి అనేక డాక్యుమెంట్లతో పాటు నకిలీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
గార్డెన్ రీచ్ షిప్ యార్డు, నేతాజీ సుభాష్ డాక్ యార్డుల పటాలు కూడా వారివద్ద లభ్యమయ్యాయి. వీటిని దేని నిమిత్తం సేకరించారు? పాకిస్థాన్కు ఏమైనా కీలక సమాచారం అందించారా? ఢిల్లీ, కోల్కతా ఘటనల మధ్య ఏమైనా సంబంధముందా? అనే విషయాలపై భద్రతా దళాలు ఆరా తీస్తున్నాయి.