గగన్యాన్: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ సిద్ధం చేస్తోన్న ఇస్రో
హైదరాబాద్/నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇస్రో మరో లాంచ్ ప్యాడ్ను సిద్ధం చేస్తోంది. గగన్యాన్ ప్రాజెక్టు కోసం మూడవ లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అక్కడ ఇప్పుడున్న రెండు లాంచ్ ప్యాడ్లు వరుస ప్రయోగాలతో బిజీగా ఉన్నాయి.
కాగా, 2022లోగా భారత వ్యోమగామి అంతరిక్షంలో విహరిస్తారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ తెలిపారు. దానికి తగినట్టుగానే ఇస్రో ప్రయత్నాలు సాగిస్తోంది. ముగ్గురు భారత వ్యోమగాములను సుమారు 7 రోజుల పాటు అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం 2004 నుంచే ప్రయోగాలు నిర్వహిస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. స్పేస్ క్యాప్సూల్ రికవరీ, క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రి ఎంటీ, ప్యాడ్ అబోర్ట్ లాంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు.
జీఎస్ఎల్వీ మాక్-3 వెహికల్ ద్వారా గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే ఈ ప్రయోగాన్ని కొత్త లాంచ్ ప్యాడ్ నుంచే ప్రయోగించనున్నారు. ఇంకా చిన్న తరహా ఉపగ్రహాలను నింగికి పంపేందుకు ఇస్రో మరో ప్రత్యామ్నాయ కేంద్రం కోసం ప్రణాళికలు చేసింది. ఇందుకు గుజరాత్ తీరంలో ఓ లాంచ్ ప్యాడ్ను నిర్మించాలని నిర్ణయించింది.