అధికారుల కక్కుర్తి: ఒకే బ్యాంకులో 40కోట్ల డిపాజిట్, తెల్లధనంగా మార్చేయత్నం
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి అడ్డకట్ట పడుతుందనుకుంటే.. అక్రమార్కులు మాత్రం తమ వద్ద ఉన్న ధనాన్ని తెల్లగా మార్చేందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి అడ్డకట్ట పడుతుందనుకుంటే.. అక్రమార్కులు మాత్రం తమ వద్ద ఉన్న ధనాన్ని తెల్లగా మార్చేందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎలాగైనా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు అడ్డదారుల్లో వెళుతూ.. మరికొందరితో తప్పుడు పనులు చేయిస్తున్నారు. ఇలాంటి ఘటనే దేశ రాజధానిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంక్ కష్మీరే గేట్శాఖలో సుమారు రూ.40 కోట్ల విలువైన పాత నోట్ల(రద్దైన రూ.500, 1000)ను డిపాజిట్ చేసినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు రూ.39.26కోట్ల విలువైన పాత నోట్లను నవంబర్ 11 నుంచి 22 మధ్య కాలంలో కొత్తగా తెరచిన మూడు అకౌంట్లలో జమ చేశారు.
అనంతరం ఎలక్ట్రానిక్స్ లావాదేవీ ద్వారా వాటిని వేరే అకౌంట్లకు మళ్లించారు. లెక్కల్లో చూపని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చివేస్తున్నట్లు ఆదాయపు పన్నుశాఖ అధికారుల విచారణలో తేలింది. ఒప్పందంలో భాగంగా సదరు బ్యాంక్ మేనేజర్కు రూ.40లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం.
ఈ కేసులో నిందితులను విచారించగా బ్యాంకు మేనేజర్ పనివేళల అనంతరం ప్రత్యేక కౌంటర్ కేటాయించి మరీ పాత నోట్లను స్వీకరించినట్లు చెప్పడం కొసమెరుపు. ఈ బ్యాంకును తనిఖీ చేసిన అధికారులు నగదును, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు.
ఢిల్లీలోని మరికొన్ని బ్యాంకుల్లోనూ ఈ తరహా బాగోతమే జరిగి ఉంటుందని ఆదాయపన్ను శాఖ నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. కొందరు పాత ఢిల్లీ, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని వర్తకుల వద్ద నుంచి లెక్కల్లో చూపని నగదును సేకరించి వాటిని బ్యాంకుల్లో జమచేస్తున్నట్లు తెలిసింది.
కాగా, అక్రమ సొమ్ముకు కక్కుర్తిపడిన కొందరు బ్యాంకు అధికారులు కూడా వీరికి సహకరించడం గమనార్హం. బ్యాంకు అధికారుల మూలంగానే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు నిఘాను పెంచినట్లు సమాచారం.