టెక్కీలకు షాక్: వచ్చే 6 మాసాల్లో కొత్త ఉద్యోగాలు లేవు, 15% తగ్గిన నియామాకాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఆరుమాసాల్లో టెక్కీలకు కష్టకాలమేనని సర్వేలు చెబుతున్నాయి.దీంతో వేచి చూసే ధోరణిని సాఫ్ట్ వేర్ కంపెనీలు అవలంభిస్తున్నాయి.
అమెరికాలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో వస్తోన్న మార్పులు టెక్కీలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు సాఫ్ట్ వేర్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి.
స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ట్రంప్ ఎన్నికల్లో హమీ ఇచ్చారు. ఈ మేరకు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగావకాశాల్లో స్థానికులకే దక్కేలా ఇటీవలనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చాడు.
సాఫ్ట్ వేర్ రంగంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ప్రధానంగా టెక్కీలపై చూపుతోంది.ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ రంగ నిపుణులపై ఈ ప్రబావం కన్పించనుంది.దీంతో రానున్న రోజుల్లో టెక్కీలకు గడ్డుకాలమేనని సర్వేలు చెబుతున్నాయి.
ఇప్పటికే కొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకొనే పనిని మొదలుపెట్టాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తగ్గించుకొనే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు వార్తలు కూడ వెలువడుతున్నాయి.
సాఫ్ట్ వేర్ కంపెనీల్లో నియామకాల నిలిపివేత
కొన్ని సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇచ్చేశాయి, మరికొన్ని సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకొంటున్నాయి.అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా కొత్తి ఉద్యోగుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. వచ్చే ఆరుమాసాల కాలంలో సాప్ట్ వేర్ సంస్థల్లో నియామాకాలకు కష్టకాలమేనని సర్వేలు చెబుతున్నాయి.
వేచి చూసే ధోరణిలో ఐటీ కంపెనీలు
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొన్న మార్పుల దృష్ట్యా వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయి సాఫ్ట్ వేర్ కంపెనీలు. బ్రెగ్జిట్, హెచ్ 1 బీ వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వంటి అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయి. ఈ మేరకు సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.తక్షణ డిమాండ్ కోసం తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి.
ఆటోమేషన్ ప్రభావం కూడ
ఆటోమేషన్ ప్రభావం మెజార్టీ ఐటీ సంస్థలపై కన్పిస్తోంది. మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ రావు చెప్పారు. ఏప్రిల్ -సెప్టెంబర్ వ్యవధిలో నియామాకాల ప్లాన్స్ పై దేశీయ ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వచ్చే రెండు క్వార్టర్లో ఐటీ సంస్థల నియామాకాలపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వే నివేదికల ఆధారంగా రానున్న ఆరు మాసాల్లో నియామాకాలు ఉండకపోవచ్చని తేలింది.
15 శాతం తగ్గిన నియామాకాలు
హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, బ్రెగ్జిట్ తో వచ్చే ఆరుమాసాల కాలంలో దేశీయ ఐటీ కంపెనీల నియామకాలు ప్రోత్సాహాకరంగా లేవని సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. ఈ క్వార్టర్ లో 15 శాతం ఉద్యోగ నియామాకాలు తగ్గాయని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కేవలం 58 శాతం కంపెనీలు మాత్రమే వచ్చే రెండు క్వార్టర్ లో నియామాకాలు చేపట్టాలని యోచిస్తున్నాయి.