అయోధ్యలో భూమి పూజ వేళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్యాగ్స్ ఇవే..!
2020 ఆగష్టు 5వ తేదీ బుధవారం రోజున ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొన్ని కోట్లమంది భారతీయుల కలకు నేడు నెరవేరనుంది. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణంకు శంకుస్థాపన జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అయోధ్య అనే ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు జైశ్రీరామ్ అనే ట్యాగ్ కూడా ట్రెండింగ్లో ఉంది.
Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామి
ఆగష్టు 5వ తేదీన చారిత్రాత్మక ఘట్టం ఉన్నందున ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు ఈ అద్భుత ఘట్టంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే జైశ్రీరామ్ అనే ట్యాగ్తో వారు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. అయోధ్య రామమందిర భూమి పూజ సందర్భంగా విదేశాల్లో ఇప్పటికే చాలా చోట్ల అక్కడి హిందువులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ వీడియోలను సైతం జైశ్రీరామ్ ట్యాగ్తో ట్విటర్లో పోస్టు చేస్తున్నారు.
ఇక ట్విటర్లో మరో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అదే #LandOfRavanan. ఇది నాల్గవ స్థానంలో ట్రెండ్ అవుతోంది. రావణన్ తమిళ రాజ్యాధిపతి అని రావణాసురుడు తమిళులకు గర్వకారణమని, తమిళులకు రావణాసురుడు ఒక గుర్తింపు అని ట్రెండ్ అవుతోంది. ఇది కచ్చితంగా అయోధ్య భూమి పూజ రోజునే ట్రెండ్ కావడం చర్చనీయాంశమైంది. రావణాసురుడి కోసం కూడా తమిళనాడులో మరో ఆలయం నిర్మాణం చేస్తామని తమిళనాడుకు చెందిన కొందరు ట్వీట్ చేశారు.
ఇక హనుమాన్ గర్హికూడా ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్న తర్వాత ముందుగా హనుమాన్ గర్హి ఆలయంను సందర్శిస్తారు. అక్కడే 10 నిమిషాల పాటు పూజచేయనుండటం అదే సమయంలో ప్రధానికి వెండి కిరీటంను ఆలయ ప్రధాన అర్చకులు ప్రేమ్జీ దాస్ బహుకరించనుండటంతో #Hanumangarhi కూడా ట్రెండ్ అవుతోంది.