అమ్మ దశను తిప్పేసిన ఆ 'రెండు గంటలు' : ఇదీ జరిగింది..
చెన్నై : ఎంత కష్టపడ్డా సరే.. కొన్నిసార్లు అదృష్టం తోడవకపోతే ఓటమి పాలవడం ఖాయం. తాజా తమిళనాడు ఎన్నికల్లోను ఇదే రుజువైంది. అమ్మ గెలుపుకు ఏవేవో కారణాలు బయటికి వినిపిస్తున్నా..! అసలు కారణం మాత్రం ఇదేనంటున్నారు అక్కడి జనం. అమ్మ ఇచ్చిన ఉచిత హామిలకు తోడు, పోలింగ్ రోజు 'ఆ రెండు గంటల టైమింగ్' జయలలిత విజయానికి చాలావరకు కలిసొచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. తమిళనాడులో జరిగిన ఎన్నికల పోలింగ్ లో, పొద్దంతా జరిగిన పోలింగ్ ఒక ఎత్తయితే, పోలింగ్ ముగిసే రెండు గంటల ముందు జరిగిన పోలింగ్ ఇంకో ఎత్తు అంటున్నారు. ఈ చివరి రెండు గంటలే ఫలితాలను మార్చివేశాయని చెప్తున్నారు. పోలింగ్ కి వర్షం అడ్డంకిగా మారడంతో పోలింగ్ సమయాన్ని పెంచారు అక్కడి ఎన్నికల అధికారులు.
పెంచిన సమయం ఉద్యోగస్తులైన మహిళలకు కలిసిరావడంతో, వారంతా పోలింగ్ ముగిసే చివరి రెండు గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారట. ఈ రెండు గంటల్లో ఓటు వేసిన మహిళల్లో అత్యధికులు జయలలిత హాఫ్ రేటు స్కూటీలకు ఆకర్షితులైన వారేనట. దీంతో జయలలిత ఓటు బ్యాంకు ఆ రెండు గంటల్లోనే చాలావరకు పుంజుకుని ఆమెకు విజయం కట్టబెట్టిందన్న చర్చ జరుగుతోంది. ఏదైతేనేం మొత్తానికి ఆ రెండు గంటలు జయలలితను మరో ఐదేళ్లు రూలింగ్ లో కూర్చోబెట్టేలా చేశాయి.