జయలలిత డెత్ మిస్టరీ.. మాజీసీఎంకు, శశికళ కోడలు ఇలవరసికి నోటీసులు జారీ
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సోమవారం నుండి ఆర్ముగ స్వామి కమిషన్ జయలలితకు వైద్యం చేసిన అపోలో ఆస్పత్రి వైద్యులను విచారిస్తోంది. వారి వాంగ్మూలం తీసుకుంది. ఇక తాజాగా మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్ సెల్వం కు ఆర్ముగ స్వామి కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

పన్నీర్ సెల్వం కు నోటీసులు జారీ చేసిన ఆర్ముగ స్వామి కమీషన్
జయలలిత మృతి కేసులో ఇప్పటికే పన్నీర్ సెల్వం విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన క్రమంగా విచారణకు గైర్హాజరు అవుతూ వచ్చారు. దీంతో ఈనెల 21వ తేదీన పన్నీర్ సెల్వం విచారణకు హాజరుకావాలని తాజా నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఓపీఎస్కు నాలుగుసార్లు సమన్లు జారీ చేయగా రెండు పర్యాయాలు ఓపీఎస్ హాజరుకాకపోవడంతో మరో రెండు పర్యాయాలు ఆరుముగసామి కమిషన్ విచారణను వాయిదా వేసింది.

శశికళ కోడలు ఇలవరసికి ఆర్ముగస్వామి కమీషన్ నోటీసులు
ఇక ఇదే సమయంలో జయలలిత నివాసంలో సుదీర్ఘకాలం నివసించిన శశికళ వదిన ఇలవరసకి కూడా నోటీసులు జారీ చేశారు. , బహిష్కృత ఎఐఎడిఎంకె నేత వికె శశికళ కోడలు జె ఇళవరసి కూడా మార్చి 21న కమిషన్ ముందు హాజరుకావాలని ఆర్ముగసామి కమిషన్ మంగళవారం సమన్లు జారీ చేసింది. జయలలిత మృతి కేసు విచారణ సమయంలో ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను కూడా విచారణ చేయాలని ఆర్ముగ స్వామి కమిషన్ నిర్ణయించడంతో ఇలవరసికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

రెండు రోజులుగా అపోలో ఆస్పత్రి వైద్యుల విచారణ
జయలలిత మృతి కేసులో గత రెండు రోజులుగా అపోలో వైద్యులు విచారణకు హాజరయ్యారు. జయలలిత మృతికి సంబంధించి వారు అనేక కీలక విషయాలను కమీషన్ ముందు వెల్లడించారు. మొదటి రోజు విచారణలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత 2016 శాసనసభ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండో సారి సీఎం పదవి చేపట్టక ముందే తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అపోలో ఆసుపత్రి డాక్టర్ బాబు మోహన్ జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పటికే ఆమె ఇతరుల సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారు.

రెండో రోజు విచారణలో వైద్యులు చెప్పిందిదే
రెండో రోజు విచారణకు అపోలో వైద్యుల బృందం కమిషన్ ముందు హాజరయ్యారు. జయలలితకు అందించిన చికిత్సపై వారు స్పందిస్తూ, ఉత్తమ చికిత్స అందించినప్పటికీ, జయలలిత గుండెపోటుతో మరణించారని చెప్పారు. విచారణ అనంతరం శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథూర్ పాండియన్ మాట్లాడుతూ మార్చి 15 తర్వాత కమిషన్ ఓపీఎస్కు సమన్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. దివంగత మాజీ సీఎం జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
Recommended Video

రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఆర్ముగ స్వామి కమీషన్ విచారణ
జయలలిత 2016 సెప్టెంబర్ 22వ తేదీన రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది, డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. అధికారంలో ఉండగా మరణించిన భారతదేశ మొదటి మహిళా ముఖ్యమంత్రి జయలలిత. తమిళనాడు ప్రభుత్వం ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ ఏ ఆర్ముగ స్వామి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. కమిషన్ జయలలిత మృతి కేసులో విచారణను అప్పటి నుండి కొనసాగిస్తూనే ఉంది. రెండేళ్ళ క్రితం వరకు ఈ కేసులో విచారణ సాగినా, కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్ళ నుండి విచారణ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ విచారణను కొనసాగిస్తున్నారు ఆర్ముగ స్వామి కమీషన్.












Click it and Unblock the Notifications