జయ అస్తమయం: సీఎం సిద్దూ ఏమన్నారంటే !
చెన్నై/బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో అనంతలోకాలుకు వెళ్లిపోయిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నివాళులు అర్పించడానికి పార్టీలకు అతీతంగా నాయకులు తరలివెలుతున్నారు.
Photos : జయలలిత కు నివాళి
కావేరీ జలాల పంపిణి విషయంలో నిత్యం నువ్వా నేనా అంటూ సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య జయలలితను చివరి సారిగా దర్శించుకోవడానికి చెన్నై బయులుదేరి వెళ్లారు.
జయలలిత త్వరగా కోలుకోవాలని ఆదివారం రాత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దేవుడిని ప్రార్థించారు. జయలలిత మరణించారని అధికారికంగా ప్రకటించడంతో ఆయన మంగళవారం చెన్నై బయలుదేరి వెళ్లారు.
భారత మాజీ ప్రధాని, దళపతి హెచ్.డీ. దేవేగౌడ, కర్ణాటక సీనియర్ మంత్రి డీ.కే. శివకుమార్ తదితరులు చెన్నై చేరుకుని జయలలితకు నివాళులు అర్పించనున్నారు. వ్యక్తి గతం వేరు, రాజకీయాలు వేరు అని వీరంటున్నారు.
తాము రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కోసం పోరాటం చేసుకుంటాము కాని వ్యక్తిగతంగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోమని, మేము స్నేహితులు అంటూ గతంలో జయలలిత, సిద్దరామయ్య వేర్వేరుగా మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. జయలలిత జన్మించిన మైసూరు ప్రాంతంలోనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య జన్మించారు. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ముందు నుంచి వీరికి పరిచయం ఉంది.