ఒంటరి టీచర్: ట్రయాంగిల్ 'లవ్', వివాహేతర సంబంధంతో దారుణ హత్య
చెన్నై: వివాహేతర సంబంధం ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. నిర్దాక్షిణ్యంగా కారుతో ఆమెను తొక్కి చంపించాడు ప్రియుడు. చెన్నైలోని అన్నానగర్ న్యూ ఆవడిరోడ్డుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం.. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా మెలగడమే ఆమె హత్యకు కారణమైనట్లుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని తోళవన్ పాళెయంకు చెందిన నివేదా(47) పొల్లాచ్చిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 20ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకుని తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో.. ఆమె గత కొన్నేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది.
వివాహేతర సంబంధం:
ఈ నేపథ్యంలో.. నివేదా ఇంటి పక్కన నివసించే ఇళయరాజా (29)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇళయరాజా స్థానిక అగ్నిమాపక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఏడాది క్రితం అతనికి వివాహం కావడంతో.. నివేదా వద్దకు వెళ్లడం తగ్గించేశాడు.
ఫేస్ బుక్ పరిచయం:
అదే సమయంలో కొళత్తూర్ వజ్రవేల్ కు చెందిన గణపతి(33) అనే వ్యక్తి ఫేస్ బుక్ ద్వారా నివేదాకు పరిచయమయ్యాడు. గణపతి బ్యాంకు లోన్ ఇప్పిస్తానని చెప్పడంతో నివేదా తరుచుగా అతనితో మాట్లాడేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. దీంతో గణపతి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు.
'పెళ్లి'ని వ్యతిరేకించిన ప్రియుడు:
ఇదే విషయాన్ని ప్రియుడు ఇళయరాజాకు చెప్పగా.. అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఇదిలా ఉండగానే, గణపతితో మాట్లాడేందుకు నివేదాను తీసుకుని ఇళయరాజా ఇళయరాజా కారులో చెన్నైకి వచ్చాడు.
కారుతో తొక్కించి:
అన్నానగర్ న్యూ ఆవడిరోడ్డు కూడలి వద్ద ఓ దుకాణం ఎదుట కారు ఆపి గణపతికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత గణపతి నివేదాను ఎక్కించుకుని అక్కడినుంచి బయలుదేరాడు. బైక్ పై వారిద్దరు సన్నిహితంగా మెలగడం తట్టుకోలేని ఇళయరాజా.. కారుతో వారిని ఢీకొట్టాడు. దీంతో నివేదా తీవ్ర గాయాలపాలవగా.. ఇళయరాజా స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
అప్పటికే చనిపోయి:
అనంతరం నివేదాను కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు ఇళయరాజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నివేదాను గణపతి పెళ్లి పేరుతో మోసం చేశాడని, చాలాసార్లు డబ్బులు తీసుకున్నాడని, నివేదాకు ఎంత చెప్పినా వినకపోవడంతోనే వారిద్దరిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.మొత్తం మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీయే నివేదా ప్రాణాలు తీసిందన్నది ఈ మొత్తం వ్యవహారంలో తేట తెల్లమైన అంశం.