జార్ఖండ్..మరో పొలిటికల్ థ్రిల్లర్: కింగ్ మేకర్లుగా స్టూడెంట్స్ యూనియన్, జేవీఎం: ఇక్కడా డిప్యూటీ సీఎం
Recommended Video
రాంచీ: జార్ఖండ్.. మరో మహారాష్ట్రగా ఆవిర్భవించేలా కనిపిస్తోంది. మహారాష్ట్ర, హర్యానాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, అదే తరహా వేడి.. జార్ఖండ్ లోనూ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తోంటే.. హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖరారైనట్టే. ఏ పార్టీకి కూడా అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం దక్కలేదు. ఫలితంగా- ప్రత్యామ్నాయంగా చిన్న పార్టీలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
నెక్ టు నెక్..
భారతీయ జనతా పార్టీ గానీ, కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 41 స్థానాలు దక్కలేదు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిందే తప్ప మేజిక్ ఫిగర్ కు ఆమడదూరంలో నిలిచిపోయింది. అత్యధిక స్థానాలను బీజేపీ సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చిన్న పార్టీల సహకారం తప్పనిసరి. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసం నాలుగైదు సీట్లకు మించి లేవు.
కింగ్ మేకర్లుగా..
ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్), అఖిల జార్ఖండ్ విద్యార్థి యూనియన్ (ఏజెఎస్యూ) కీలకంగా మారాయి. కింగ్ మేకర్లుగా అవతరించనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి. ఇదివరకు అఖిల జార్ఖండ్ విద్యార్థి యూనియన్.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ.. సీట్ల సర్దుబాటు చేసుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. దీనితో- బీజేపీ దగ్గర బేరం ఆడటానికి అవకాశం దక్కినట్లు చెబుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి సహా..
హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమనే విషయం తెలిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జెవీఎం, ఏజెెఎస్యూలతో మంతనాలు ఆరంభించింది. ఈ రెండు పార్టీలకు కూడా ఉప ముఖ్యమంత్రి స్థానాలను బీజేపీ ఆఫర్ చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తే.. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్ లో కీలక పోర్ట్ ఫోలియోలను కేటాయిస్తామనే సంకేతాలను బీజేపీ పంపించినట్టు చెబుతున్నారు.
కాంగ్రెస్.. అనూహ్యం..
కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రెండో స్థానానికి పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఆరంభ ఫలితాల్లో దూసుకెళ్లిన కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ సంకీర్ణ కూటమి.. చివరి వరకూ అదే ఆధిక్యాన్ని కనపర్చలేకపోయింది. చతికిల పడింది. ఫలితాలు చివరి దశకు వచ్చే సమయానికి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. జేవీఎం గానీ, ఏజెఎస్యూ గానీ మద్దతు ఇస్తే.. తప్ప కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు.
టార్గెట్.. 41
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం 41. ఈ మేజిక్ ఫిగర్ ను అందుకునే వారిదే అధికారం. ఆ ఛాన్స్ ఒక్క కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీకే ఉందంటూ జాతీయస్థాయిలో అన్ని ప్రధాన ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మహారాష్ట్ర తరహా ఎన్నికల వాతావరణం నెలకొనే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అభిప్రాయపడ్డాయి.