బీజేపీ మైండ్ బ్లాంక్ చేసిన సీఎం - ఒకే దెబ్బతో కుదేల్..!!
రాంచీ: కొద్దిరోజులుగా జార్ఖండ్లో చోటు చేసుకుంటూ వస్తోన్న రాజకీయ పరిణామాలకు తెర పడింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. విశ్వస పరీక్షలో నెగ్గారు. తన బలాన్ని నిరూపించుకున్నారు. మైనింగ్ వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు పట్టింది. రాజకీయ అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నించింది. శాసన సభ్యుడిగాపై హేమంత్ సోరెన్పై అనర్హత వేటుకు కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్కు సిఫారసు చేసిన నేపథ్యంలో తలెత్తిన ఈ అనిశ్చిత పరిస్థితులను ఆయన అధిగమించారు.
ఛత్తీస్గఢ్ నుంచి రాంచీకి..
జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో హేమంత్ సోరెన్ విజయం సాధించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్కు తమ పార్టీ ఎమ్మెల్యేలను తరలించారాయన. వాల్లంతా ఇవ్వాళ తిరిగి రాంచీకి చేరుకున్నారు. రాయ్పుర్ నుంచి ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో 30 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రాంచీకి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.
బీజేపీపై ఘాటు విమర్శలు..
ఈ ఉదయం సభలో విశ్వాస తీర్మానాన్ని హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ప్రారంభించారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ఇందులో ఉదహరించారు.
అధికారంలోకి రావడానికి
అలాగే- కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అధికార పార్టీలను బీజేపీ నాయకులు ఏ రకంగా కుప్పకూల్చారో గుర్తు చేశారు. అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. బిహార్లోనూ జనతాదళ్ (యునైటెడ్)లో చీలికను తీసుకుని రావడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించారని, అందుకే నితీష్ కుమార్ ముందుజాగ్రత్త పడ్డారని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరుతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు అప్రజాస్వామ్యానికి తెర తీస్తోన్నారని అన్నారు.
కోట్లు వెదజల్లే ప్రయత్నం..
బీజేపీలో తీర్థాన్ని పుచ్చుకున్న వారి ఇళ్లపై ఎందుకు సీబీఐ గానీ, ఈడీ గానీ, ఐటీ గానీ దాడులు చేయట్లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోందంటూ హేమంత్ సోరెన్ మండిపడ్డారు. తమ పార్టీ శాసన సభ్యులను కొనుగోలు చేయడానికి విచ్చలవిడిగా కోట్ల రూపాయలను వెదజల్లడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.
48 ఓట్లతో..
పశ్చిమ బెంగాల్లో ఉన్న ముగ్గురు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి బీజేపీకి చెందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ప్రయత్నించినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కొంతమంది వ్యాపారవేత్తల కోసమే బీజేపీ దేశాన్ని ఏలుతోందని హేమంత్ సోరెన్ ధ్వజమెత్తారు. అనంతరం- ఈ విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 81 మంది శాసన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా 48 మంది సభ్యులు ఓటు వేశారు. దీనితో సోరెన్- విశ్వాస పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు.