36 ఏళ్ల సర్వసంగ పరిత్యాగిణి.. అయినా వదల్లేదు: గ్యాంగ్రేప్: నిందితుల కోసం సిట్
రాంచీ: ఆమె సర్వసంగ పరిత్యాగిణి. అన్నింటినీ వదులుకుని ఓ ఆశ్రమంలో కాలం గడుపుతున్నారు. కొందరు కామాంధులు ఆమెను కూడా వదల్లేదు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందంటే.. పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధ్విపై నలుగురు అత్యాచారానికి పాల్పడగా.. ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురూ పరారీలో ఉన్నారు.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా: భారత్-చైనా విదేశాంగ మంత్రుల లంచ్ మీటింగ్? ఏం జరుగుతుందో?
జార్ఖండ్లోని గొడ్డా జిల్లా ముఫసిల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పఠ్బారా-కథోన్ ప్రాంతంలోని రనిధి గ్రామంలో ఉందీ ఆశ్రమం. మహర్షి మేహి ఆశ్రమం పేరుతో చాలాకాలం నుంచి కొనసాగుతోంది. బొకారోకు చెందిన సాధ్వి కొంతకాలంగా ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆశ్రమంలోకి చొరబడ్డారు. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించిన విషయం తెలుసుకుని మిగిలిన వారు అప్రమత్తం అయ్యే లోపే వారు పారిపోయారు.
తనపై జరిగిన ఘాతుకంపై బాధితురాలు ముఫసిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యాచార ఘటనతో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న పస్రా గ్రామానికి చెందిన దీపక్ రాణా అనే 22 సంవత్సరాల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని గొడ్డా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వైఎస్ రమేష్ తెలిపారు. మిగిలిన ముగ్గురి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఫోన్ కాల్లిస్ట్ ఆధారంగా వారి కోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన పట్ల గొడ్డా జిల్లాలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు కరవు అయ్యాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మండిపడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆశ్రమంలో నివసిస్తోన్న ఓ సాధ్వికి రక్షణ కల్పించలేకపోయారని స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మావోయిస్టులు, నేరస్తులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ ధ్వజమెత్తారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేయాలని, మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.