మధ్యప్రదేశా్ బీజేపీపై జ్యోతిరాదిత్య సింధియా ముద్ర-పార్టీ పదవుల్లో అనుచరులకు సింహభాగం
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడాదిలోనే కేంద్ర కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్న యువ నేత జ్యోతిరాదిత్య సింధియా తనదైన ముద్ర వేస్తున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ త్వరలో చేపట్టే నామినేటెడ్ పదవుల పంపకాల్లో తన అనుచరులకు సింధియా భారీగా పదవులు ఇప్పించుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లో త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో అత్యధిక స్ధానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న అధికార బీజేపీ.. సింధియా అనుచరులకు నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కేటాయించేందుకు అంగీకరించింది. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సింధియా ముద్ర మరోసారి స్పష్టమైంది. ఈ ఏడాది దామోహ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ.. ఈసారి స్ధానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. దీంతో సింధియా వర్గాన్ని ప్రోత్సహించడం ద్వారా మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.
అదే సమయంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. సింధియా వర్గానికి అత్యధికంగా నామినేటెడ్ పదవులు కేటాయిస్తున్న నేపథ్యంలో శివరాజ్ సింగా్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ఇప్పటికే పెరుగుతున్న సింధియా ప్రాభవం నేపథ్యంలో తనకు ఇబ్బంది లేకుండా చూడాలని చౌహాన్ బీజేపీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. సింధియా వర్గం తరఫున నామినేటెడ్ పదవులు దక్కించుకుంటున్న వారిలో పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం.