జయపై కోపం తగ్గలేదు!: మళ్లీ ఎన్నికలంటూ కమల్ సంచలనం
తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఎడపాడి పళినస్వామి ప్రభుత్వం నాలుగేళ్లపాటూ ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదని,
చెన్నై: తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఎడపాడి పళినస్వామి ప్రభుత్వం నాలుగేళ్లపాటూ ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదని, కాబట్టి వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ఏర్పడిన పరిణామాలు కమల్లో ఉన్న రాజకీయాలపై ఆసక్తిని బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జల్లికట్టు ఉద్యమం మొదలు అనేక కీలక అంశాలపై విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ సోమవారం ఓ తమిళ టీవీ ఛానల్ పుదియ తలైమురైకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచనలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఆపిందెవరో తెలుసు..
విశ్వరూపం సినిమా విడుదలకు ముం దు, ఆ తరువాత చోటుచేసుకున్న పరి ణామాలకు కారణం ఇస్లాం వర్గం కాదు, రాజకీయ నాయకులేనని స్పష్టం చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న వారే విశ్వరూపం విడుదల కాకుండా అడ్డుకున్నారని పరోక్షంగా ఆనాటి సీఎం జయలలితపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమల్.
మాట్లాడుతూనే ఉంటా..
తాను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతానని, అదే రాజకీయ మాటలుగా మారాయని చెప్పారు. భవిష్యత్తు రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే ఇంకా మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
అందుకే విమర్శలు..
అంతేగాక, ‘కేవలం కళాకారుడిగా ఉండడం నావల్ల కాదు. నా వ్యాఖ్యలు ప్రజలకు చేరుతాయి కాబట్టే విమర్శలు చేస్తున్నాను. నా జీవితంలో అవినీతి, అక్రమాలకు తావివ్వలేదు. నా మాటల ప్రభావం అడ్డుపెట్టుకుని ఓటు అమ్ముకుంటే నేతలను ప్రశ్నించే అవకాశం ఉండదు' అని కమల్ వ్యాఖ్యానించారు.
ఎవర్నైనా నిలదీస్తా..
నేరాలు ఘోరాలకు పాల్పడితే అధికారంలో ఎవరున్నా నిలదీస్తానని తేల్చి చెప్పారు. భారత దేశ పౌరుడిగా రాజకీయాలు మాట్లాడే హక్కు తనకుందని, తాను ఎర్రచొక్కా వేసుకున్నంత మాత్రానా కమ్యూనిస్టు వాది అని భావించరారాదని అన్నారు. ఇంటర్వ్యూకు ఎర్రచొక్కా వేసుకుని వచ్చినందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంతో కాలంగా ఆ ప్రయత్నాలు..
‘నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం తప్పులు చేసే కొద్దీ ప్రజల్లో సహనం నశించిపోయి ఆగ్రహం పెరిగిపోతుంది. కాలానికి అనుగుణంగా రాజకీయనాయకులు మారాలి. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలి. ద్రవిడ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పడానికి వీల్లేదు. తమిళ తల్లి ఆశీర్వాదం ఉన్నంత వరకు ద్రవిడ సిద్ధాంతం వర్ధిల్లుతూనే ఉంటుంది' అని కమల్ తెలిపారు.
జయ పాలనలో పారదర్శకత లేదు..
‘జాతీయ పార్టీలు రాష్ట్ర పాలనలో ప్రవేశించదలుచుకుంటే ద్రవిడ పార్టీలను ఢీకొనక తప్పదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక మర్మాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జయలలిత తన జీవితంలో పారదర్శకంగా వ్యవహరించలేదు. ఆమెకు జరిగిన చికిత్స సైతం గోప్యంగా ఉంచడానికి ఇది ఒక కారణం కావచ్చు' అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
పళని ప్రభుత్వానికి ప్రజామోదం లేదు.. మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే
‘ప్రస్తుతం రాష్ట్రంలోని ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదు. రాష్ట్రంలో వెంటనే ఎన్నికలు జరగాలి. ఎన్నికలు నిర్వహించేందుకు చట్టం ఒప్పుకోదు అనే కారణంతో ప్రజలకు ఇష్టంలేని పాలనను నాలుగేళ్లు కొనసాగాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లు కొనసాగాల్సిందేనని చెప్పడం బలవంతపు పెళ్లిలా ఉంటుంది. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ప్రజలు నిర్ణయించాలి' అని కమల్ స్పష్టం చేశారు.
కమల్ ఎంట్రీ ఇస్తారా?
‘పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి... వీరిద్దరిలో ఎవరిపైనా తనకు ప్రత్యేకమైన మమకారం లేదు. ఎవ్వరికీ మద్దతుగా నేను మాట్లాడటం లేదు. సినిమాల గురించి రాజకీయనాయకులు మాట్లాడినట్లే రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా. రాజకీయాల్లో ధనప్రభావం, కుల మతాల జాఢ్యం పోవాలని ఆశిస్తు న్నా' అని కమల్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా, జయ మరణించిన తర్వాత నుంచి కూడా కమల్ హాసన్ తమిల రాజకీయాల్లో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాలపై కమల్ తన వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. మరి పూర్తిస్థాయి రాజకీయాల్లో వస్తారా? లేదా? అనేది కమల్కే తెలియాలి.. లేదంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.